Nara Lokesh: మ‌న‌వ‌డిలా లోకేశ్ భ‌రోసా... అవ్వ కులాసా... యువగళంలో ఆసక్తికర సన్నివేశం

  • నంద్యాల జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర 
  • పార్నపల్లి వద్ద దారి పక్కన సైకిల్ పంక్చర్ల షాపు నడుపుతున్న వృద్ధురాలు
  • వృద్ధురాలిని చూసి ఆగిన నారా లోకేశ్
  • ఆమెతో మాటా మంతీ
  • ఆ వృద్ధురాలి హజ్ యాత్రకు తాను సాయం చేస్తానని వెల్లడి
Lokesh assures an old woman to go Hajj

ఆ నిరుపేద ముస్లిం వృద్ధురాలికి హ‌జ్ యాత్ర చేయాల‌నేది చిర‌కాల కోరిక‌. ఆమె పేరు షేక్ హుసేన్ బేగ్. వయసు అర‌వై ఏళ్లు పైబడింది. ఏడాది క్రితం భ‌ర్త చ‌నిపోయాడు. బ‌తుకుబండిని న‌డిపిస్తున్న అవ్వ‌కు నారా లోకేశ్ ఓ మ‌న‌వ‌డిలా భ‌రోసా ఇచ్చారు. ఆమె హజ్ యాత్ర కలగా మిగిలిపోకుండా తాను సాయపడతానని వెల్లడించారు.

నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, పార్నపల్లి గ్రామం మీదుగా యువ‌గ‌ళం పాద‌యాత్ర సాగుతుండ‌గా, దారిప‌క్క‌న వృద్ధురాలు షేక్ హుసేన్ బేగ్ సైకిల్ పంక్చ‌ర్ల షాపు న‌డుపుతూ లోకేశ్ కు క‌నిపించింది. ఆ అవ్వ చెప్పిన మాటలను లోకేశ్ ఎంతో శ్రద్ధగా విన్నారు. 

భ‌ర్త షేక్ అబ్దుల్ హకీమ్ (70) పంక్చ‌ర్ షాపు న‌డుపుతూ త‌న‌ను పోషించేవాడ‌ని ఆ వృద్ధురాలు చెప్పింది. ఏడాది క్రితం కిడ్నీ స‌మ‌స్యతో భ‌ర్త చ‌నిపోవ‌డంతో, గ‌తంలో తాను నేర్చుకున్న సైకిల్ పంక్చ‌ర్లు వేయడం ఇప్పుడు ఉపాధిగా మారింద‌ని వివ‌రించింది. 

రోజంతా పనిచేస్తే  రూ.150 ఆదాయం రావ‌డం క‌ష్టంగా ఉంద‌ని, నెల‌కి క‌రెంటు బిల్లు మాత్రం రూ.500 దాటిపోతోంద‌ని హుసేన్ బేగ్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. హ‌జ్ యాత్ర‌కి వెళ్లాల‌నేది జీవిత‌కాల కోరిక అనీ, దాని కోసం తినీ తిన‌క ఓ ప‌దివేలు దాచుకున్నాన‌ని, హ‌జ్  వెళ్లాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చవుతాయ‌ని తెలిసి, దాచుకున్న ఆ ప‌దివేల‌తో పేద మ‌హిళ‌ల‌కి చీరలు కొని పంచేశాన‌ని చెప్పింది. 

అర‌వై ఏళ్లు పైబ‌డిన ఆ వృద్ధురాలు ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా, త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌డం చూసిన లోకేశ్ ఆమెని అభినందించారు. నిస్స‌హాయురాలైనా క‌ల‌త చెంద‌కుండా క‌ష్ట‌ప‌డే త‌త్వం, దాన‌గుణంతో న‌లుగురికి సేవ చేస్తున్న షేక్ హుసేన్ బేగ్ ఆద‌ర్శ మ‌హిళ అని కొనియాడారు. 

ఆమె జీవిత‌కాల కోరిక అయిన హ‌జ్ యాత్రకి త‌న సొంత ఖర్చుతో పంపుతాన‌ని లోకేశ్ అక్కడికక్కడే భరోసా ఇచ్చారు. తద్వారా ఆ వృద్ధురాలి ముఖంలో ఆనందం నింపారు.

More Telugu News