Train booking: ట్రైన్ కోచ్ ను కూడా బుక్ చేసుకోవచ్చు.. ఖర్చు ఎంతంటే!

  • బృందంగా ప్రయాణించే వారికి ఐఆర్ సీటీసీ అవకాశం
  • రూ.50 వేలు డిపాజిట్.. దూరాన్ని బట్టి మారనున్న రేటు
  • కనీసం 500 కిలోమీటర్ల దూర ప్రయాణానికే కోచ్ బుకింగ్ కు వీలు
Indian Railways Now Passengers Can Book A Coach Or Entire Train On IRCTC

బంధుమిత్రులతో కలిసి టూర్ వెళ్లాలన్నా.. విద్యార్థులంతా కలిసి విహార యాత్రకు వెళ్లాలన్నా ట్రైన్ కోచ్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే మొత్తం రైలును కూడా బుక్ చేసుకునే వీలుంది. ఈ తరహా బుకింగ్ ను ఫుల్ టారిఫ్ రేట్ (ఎఫ్ టీఆర్) బుకింగ్ అంటారు. ఇందులో ఏసీ కోచ్ ల నుంచి స్లీపర్ కోచ్ వరకు కావాల్సిన కోచ్ ను బుక్ చేసుకోవచ్చు. సాధారణ బెర్త్ బుకింగ్ తరహాలోనే కోచ్ ల బుకింగ్ కూడా 30 రోజుల నుంచి 6 నెలల ముందే చేసుకోవచ్చు. అయితే, కోచ్ బుక్ చేసుకోవాలంటే కనీస మొత్తం రూ.50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ గా కట్టాల్సి ఉంటుంది.

ప్రయాణ దూరం, ఎంపిక చేసుకున్న కోచ్ ను బట్టి ఈ మొత్తం మారుతుంది. ఇక మొత్తం ట్రైన్ ను బుక్ చేసుకోవాలంటే.. మినిమం పద్దెనిమిది కోచ్ లతో, మొత్తం రూ.9 లక్షలు డిపాజిట్ గా చెల్లించాలి. కోచ్‌ లేదా మొత్తం ట్రైన్‌ను బుక్ చేసుకోవడానికి ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, ఏసీ చైర్ కార్ లతో పాటు స్లీపర్ కోచ్ లను కూడా బుక్ చేసుకోవచ్చు.

అయితే, 500 కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించే సదర్భంలోనే ఈ బుకింగ్ సాధ్యమవుతుంది. అదేవిధంగా రానూపోనూ ప్రయాణానికి విడివిడిగా చార్జ్ చేస్తారు. ట్రైన్ బయలుదేరే స్టేషన్ నుంచి తిరిగి అదే స్టేషన్ కు రావడానికి టికెట్ ఖరీదును ప్రామాణికంగా తీసుకుని కోచ్ బుకింగ్ చార్జీలు నిర్ణయిస్తారు. ఒకవైపు ప్రయాణానికే కోచ్ ను బుక్ చేసుకుంటే.. ఆ కోచ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చును కూడా బుకింగ్ లో కలుపుతారు.

More Telugu News