MS Dhoni: అభిమానులకు ధన్యవాదాలు చెప్పిన చెన్నై టీమ్

  • లీగ్ దశలో చెపాక్ లో చివరి మ్యాచ్ తర్వాత నిర్వహించిన కార్యక్రమం
  • అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ స్టేడియం చుట్టూ తిరిగిన సీఎస్కే టీమ్
  • వీక్షకుల పైకి బ్యాడ్మింటన్ బంతులను విసిరిన ధోనీ, జడేజా, గైక్వాడ్
MS Dhoni CSK thank Chennai programme Sunil Gavaskar takes autograph

చెన్నై సూపర్ కింగ్స్ తన అభిమానులకు ఘనంగా ధన్యవాదాలు తెలియజేసింది. ఐపీఎల్ 2023 సీజన్ లో లీగ్ దశలో చెన్నై జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం చివరి మ్యాచ్ ను ముగించింది. చెన్నై జట్టు లీగ్ దశలో చివరిగా ఈ నెల 20న ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనుంది. చెపాక్ లో ఇది చివరి మ్యాచ్. ప్లే ఆఫ్ కు చేరుకుంటేనే చెన్నై జట్టు మరోసారి చెపాక్ స్టేడియంలో ఆడగలదు. చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. కనుక ప్లే ఆఫ్ కోసం చూడకుండా, లీగ్ దశలో చెపాక్ లో చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై జట్టు స్టేడియం అంతా కలియతిరిగింది. అభిమానులు అందరికీ అభివాదం తెలియజేసింది. ఇందులో చెన్నై జట్టు ఆటగాళ్లు అందరూ, కోచ్ లు, ఇతర సహాయక సిబ్బంది కూడా పాలు పంచుకున్నారు. 

చెన్నై సూపర్ కింగ్స్ కు అభిమానులు ఎక్కువ. మరే ఫ్రాంచైజీకి లేనంత అభిమానగణం దీనికి ఉంది. ఐపీఎల్ లో భాగంగా ఎప్పుడు చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా అభిమానులు భారీగా రావడమే కాదు, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లను ఎంతో ప్రోత్సహిస్తుంటారు. అందుకే తమ అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకోవడాన్ని చెన్నై ఫ్రాంచైజీ గౌరవంగా భావించింది. నిజానికి కోల్ కతాపై విజయం సాధించి ఉంటే ఇది మరింత ప్రత్యేకంగా ఉండేది. కానీ, చెన్నై జట్టుకు నిన్న కలసిరాలేదు. లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ సైతం ఈ సమయంలో మైదానంలోకి వచ్చి ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం విశేషం. అసలు ఈ కార్యక్రమం మొత్తం చాలా సందడిగా కొనసాగింది.

ధోనీ బ్యాడ్మింటన్ రాకెట్ సాయంతో బంతులను అభిమానులపైకి విసిరారు. ధోనీకి అభిమానులు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తామున్న చోట నుంచే ఫొటోలు తీసుకున్నారు. ధోనీ సైతం మైదానంలో నించుని వెనుక అభిమానులు కనిపించేలా సెల్ఫీ దిగాడు. స్టేడియంలో ఉన్న పోలీసులు కూడా ధోనీతో కరచాలనం కోసం పోటీ పడ్డారు. ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని ధోనీయే ముందుండి నడిపించాడు. అజింక్య రహానే అభిమానులకు ధన్యవాదాలు చెప్పే ప్లకార్డు పట్టుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా సైతం ర్యాకెట్లతో బ్యాడ్మింటన్ బంతులను అభిమానుల పైకి విసిరారు.  లీగ్ దశలో మొత్తం 14మ్యాచులకు గాను సీఎస్కే ఏడు మ్యాచులను చెపాక్ స్టేడియం (ఎంఏ చిదంబరం) లోనే ఆడింది. 

More Telugu News