Kanna Lakshminarayana: జగన్ తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలో టీడీపీ చేసి చూపిస్తుంది: కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీలో అకాల వర్షాలు.. తీవ్రంగా నష్టపోయిన రైతులు
  • రైతులను సీఎం జగన్ పట్టించుకోవడంలేదన్న కన్నా
  • చేతకాకపోతే సీఎం కుర్చీ దిగిపోవాలని స్పష్టీకరణ
  • చంద్రబాబు పర్యటనతో చలనం వచ్చిందని వ్యాఖ్య 
Kanna Lakshmi Narayana take a jibe at CM Jagan

రైతులు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి కుర్చీ ఉంటే చాలు... తనకు రావాల్సిన ఆదాయం వస్తుంది అన్న ధీమాలో సీఎం జగన్ ఉన్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడం జగన్ కు చేతగాకపోతే, తక్షణమే సీఎం కుర్చీనుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన పదవి నుంచి తప్పుకుంటే, అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలో టీడీపీ చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. 

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అకాల వర్షాలు, రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన రైతులు విలపిస్తుంటే, ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ధాన్యం మొలకెత్తి, మిర్చి నీళ్ల పాలై, ఇతర పంటలు పొలాల్లోనే కుళ్లి మగ్గిపోతుంటే, మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం రైతుల ముఖం కూడా చూడకుండా నిద్రపోతోందని కన్నా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

“టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి జిల్లాల్లో వరి రైతుల వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన పర్యటనలో రైతుల్ని ఆదుకోలేని  ప్రభుత్వ డొల్లతనం, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం మరోసారి బట్టబయలయ్యాయి. చంద్రబాబు రైతుల వద్దకు వెళ్లకుండా ఉంటే, అసలు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కనీసం నోటిమాటగా కూడా రైతుల ప్రస్తావన చేసేవారు కాదు. 

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుల్ని అధికారులతో కుమ్మక్కై ఎలా దోచుకుంటున్నారో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. 75 కిలోల ధాన్యం బస్తాకు ఒకచోట 5 కేజీలు, మరోచోట 12 కేజీలు అదనంగా ధాన్యం ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల మిల్లర్లను అడ్డంపెట్టుకొని ప్రభుత్వమే బస్తాకు రూ.100 నుంచి రూ.200 లు అనధికారికంగా వసూలుచేస్తోంది. 

లారీధాన్యానికి కొన్నిచోట్ల మిల్లర్లు రూ.10 వేలనుంచి రూ.20 వేల వరకు రైతులనుంచి దండుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతులకష్టాన్ని అప్పనంగా దోచుకుంటున్నా కూడా ప్రభుత్వంలో చలనంలేదు" అని విమర్శించారు. 

రైతుల కష్టానికి, నష్టానికి జగన్ ఏవిధంగా న్యాయం చేస్తాడో సమాధానం చెప్పాలని కన్నా నిలదీశారు. రూ.3 వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్ల ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏమైందో ముఖ్యమంత్రి రైతులకు చెప్పాలి అని స్పష్టం చేశారు. 

రైతుల పక్షాన జగన్ ముందు కొన్ని డిమాండ్లు ఉంచుతున్నాం: కన్నా

1. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో 75 కిలోల ధాన్యం బస్తాకు 5 నుంచి 12 కిలోల ధాన్యాన్ని అదనంగా సేకరిస్తున్నారు. ఆ విధంగా సేకరిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వమే తిరిగి రైతుకు ఇప్పించాలి.
2. మిల్లర్లు లారీ ధాన్యానికి వసూలు చేస్తున్న రూ.10 వేలనుంచి రూ.20 వేల సొమ్ముని వసూలు చేయకుండా చూడాలి. ఇప్పటికే వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లించాలి.
3. రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజను ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనాలి.
4. అపరాల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటల రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి.
5. పంటల్ని కాపాడుకునే క్రమంలో పిడుగుపాటుకు గురై, ఇతరత్రా కారణాలతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాల్ని ఆదుకోవాలి. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంఇవ్వాలి.
6. తమ కష్టం చెప్పుకోవడానికి వెళ్లిన రైతుల్ని ఎర్రి పప్ప అని తూలనాడిన మంత్రిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. మంత్రి రైతుల్ని అవమానించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి... అని కన్నా స్పష్టంచేశారు.

More Telugu News