Chandrababu: తాటికొండ ఐశ్వర్య మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది: చంద్రబాబు

  • అమెరికాలో కాల్పుల ఘటన
  • టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో భయానక ఘటన
  • కాల్పుల్లో మరణించిన ఐశ్వర్య రెడ్డి
  • గుండె తరుక్కుపోతోందన్న చంద్రబాబు
Chandrababu responds on Thatikonda Aishwarya death in US mass shooting incident

అమెరికాలో జరిగిన కాల్పుల సంఘటనలో హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి అనే యువతి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. 

హైదరాబాదుకు చెందిన 27 ఏళ్ల తాటికొండ ఐశ్వర్య అమెరికాలోని అలెన్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. ప్రస్తుతం ఐశ్వర్య కుటుంబం పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునేలా ఐశ్వర్య కుటుంబానికి దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. 

టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన జరగ్గా, ఎనిమిది మంది మరణించారు. చనిపోయిన వారిలో ఐశ్వర్య రెడ్డి కూడా ఉన్నారు. ఆమె గత ఐదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. 

2018లో ఉస్మానియా వర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పట్టా అందుకున్న ఐశ్వర్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ నుంచి 2020లో కన్ స్ట్రక్షన్ మేనేజ్ మెంట్ కోర్సులో మాస్టర్స్ డిగ్రీ అందుకున్న ఐశ్వర్య... ఆ తర్వాత టెక్సాస్ లోని ఓ స్థానిక సంస్థలో ప్రాజెక్టు ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. 

ఐశ్వర్య తండ్రి టి.నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా ఉన్నారు.

More Telugu News