Jhansi: వాళ్లకి నా శాపం మామూలుగా తగల్లేదు: యాంకర్ ఝాన్సీ

  • చాలామంది డబ్బులు ఎగ్గొట్టారన్న ఝాన్సీ 
  • చెప్పకుండా ఒక సినిమాలో నుంచి తీసేశారని వెల్లడి 
  • హఠాత్తుగా తనని కాదని వేరే యాంకర్ ని పెట్టేవారని వివరణ 
  • తనకి అన్యాయం చేసినవారు అనుభవించారని వ్యాఖ్య
Jhansi Interview

ఒకప్పుడు యాంకర్ గా .. నటిగా ఝాన్సీకి మంచి క్రేజ్ ఉండేది. తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుతూ .. "లక్షల్లో డబ్బులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. చెక్ పై మూడు నెలల ముందు డేట్ వేసి మోసం చేసినవారు ఉన్నారు. నాతో చాలా సన్నిహితంగా ఉంటూ, నా కాన్సెప్ట్ లు ఓకే కానివ్వకుండా చేసినవారు ఉన్నారు. అయినా ఎందుకు ఇలా చేశారని నేను ఇంతవరకూ అడగలేదు" అని అన్నారు. 

"నాకు అన్యాయం చేసినవారికి నా శాపం చాలా గట్టిగా తగులుతుంది .. అది నాకు తెలుసు. నా శాపం ఎంతగా తగులుతుందనేది నాతో రెండు రోజులు కేరక్టర్ చేయించుకుని పీకేసిన వారికి తెలుసు. ఒక పెద్ద హీరో .. పెద్ద డైరెక్టర్ .. రెండు రోజులు కేరక్టర్ చేశాను .. నా డబ్బులు నాకు ఇచ్చారు. కానీ ఆ తరువాత ఆ పాత్ర కోసం వేరే ఆర్టిస్ట్ ను తీసుకున్నారు. నిజంగా అది నాకు అవమానమే. దాంతో నా శాపము గట్టిగా తగిలింది .. మళ్లీ ఇంతవరకూ కోలుకోలేదు" అన్నారు. 

ఇక ఒక టీవీ ఛానల్ లో ఉత్తరాలు చదివే కార్యక్రమం ఒకటి ఉండేది. ఒక రోజున నేను షూటింగు కోసం వెళ్లేసరికి వేరే యాంకర్ ను పెట్టేసి చేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఛేంజ్ కోసం అని అన్నారు. అప్పుడు నాకు చాలా బాధకలిగింది. అప్పటి నుంచి వేరే వారు చేసే కార్యక్రమాలకి నన్ను అడిగితే, అప్పటివరకూ చేస్తున్నవారికి ఒక మాట చెప్పి చేయడం మొదలెట్టాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News