Adipurush: తెలుగు రాష్ట్రాల్లో 105 థియేటర్లలో ‘ఆదిపురుష్’ ట్రైలర్.. ఎప్పుడంటే..!

  • ఈ నెల 9న సాయంత్రం 5.30కి స్క్రీనింగ్
  • వెల్లడించిన హీరో ప్రభాస్
  • భద్రాచలం, తిరుపతిలో స్పెషల్ ఈవెంట్!
Adipurush Trailer t will be screened in 105 theaters in AP and TG On 9th May

తను శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్'పై హీరో ప్రభాస్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సంక్రాంతికే రావాల్సిన చిత్రం వాయిదా పడుతూ జూన్ 16న విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ కృతీసనన్ సీత పాత్ర, మరో బడా హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటించిన ఈ చిత్రం త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాన్నాళ్ల కిందటే విడుదల చేసిన టీజర్ లో సీజీ వర్క్ బాగాలేదని విమర్శలు వచ్చాయి. దాంతో, చిత్రాన్ని వాయిదా వేసుకొని విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ను చిత్ర బృందం సరిచేసింది. 

విడుదలకు మరో నెల రోజులే ఉండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 9న త్రీడీ ట్రైలర్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఆ రోజు సాయంత్రం 5.30 గంటలకు దేశ వ్యాప్తంగా పలు థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో 105 థియేటర్లలో ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రభాస్ ట్వీట్ చేశారు. ఆదిపురుష్ పోస్టర్ తో పాటు థియేటర్ల జాబితాను షేర్ చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో అభిమానులకు ఒక రోజు ముందే.. అంటే ఈనెల 8వ తేదీనే ట్రైలర్ ను చూపిస్తారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే, మే9న తిరుపతి, భద్రాచలంలో ఏకకాలంలో భారీ ఈవెంట్లు చేయాలని కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. కానీ, వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More Telugu News