Venkaiah Naidu: పాక ఇడ్లీ తిన్న వెంకయ్యనాయుడు

  • విజయవాడ మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న పాక ఇడ్లీ సెంటర్ కి వెళ్లిన వెంకయ్య
  • ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయని ప్రశంస
  • గతంలో కూడా తాను ఒకసారి ఇక్కడకు వచ్చానన్న మాజీ ఉప రాష్ట్రపతి
Venkaiah Naidu eats Paka Idli

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు, సామాజిక సేవాకార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. తాజాగా విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఎస్ఎస్ఎస్ ఇడ్లీ సెంటర్ (పాక ఇడ్లీ)లో ఆయన టిఫిన్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారు. హోటల్ లో ఇడ్లీలను వీరు ఆరగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఇడ్లీలు అద్భుతమైన ఆహారమని చెప్పారు. పాక ఇడ్లీ అంటే తనకు ఇష్టమని... గతంలో కూడా ఎప్పుడో ఒకసారి తాను ఇక్కడ ఇడ్లీలు తిన్నానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ఇడ్లీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందని కితాబునిచ్చారు. 

సంప్రదాయ వంటలనే మనం ఆహారపుటలవాట్లుగా మార్చుకోవాలని వెంకయ్య హితబోధ చేశారు. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు అంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని విమర్శించారు. పిల్లలకు, యువతకు తల్లిదండ్రులు మన సంప్రదాయ వంటలను అలవాటు చేయాలని చెప్పారు. అమ్మ చేతి వంట ఎప్పుడూ అమృతమేనని అన్నారు. వ్యాయామమే కాదు, మన సంప్రదాయ వంటలు కూడా మనకు అంతే ముఖ్యమని చెప్పారు. పాక ఇడ్లీ యజమాని కృష్ణప్రసాద్ ను ఆయన అభినందించారు.

More Telugu News