Narendra Modi: నేడు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. అందరూ వినాలంటూ ప్రధాని ఆహ్వానం!

  • నేడు ఉదయం 11.00కు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ప్రసారం
  • అందరూ వినాలంటూ ట్విట్టర్  వేదికగా మోదీ ఆహ్వానం
  • మోదీ ప్రసంగం దేశ ప్రజలందరికీ చేరేలా బీజేపీ విస్తృత ఏర్పాట్లు
Mann ki baat 100 episode today

దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ నెలనెలా చేసే రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ‘మన్ కీ బాత్‘ 100 వ ఎపిసోడ్ నేడు ఉదయం 11.00 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో 100వ ఎపిసోడ్‌ను అందరూ వినాలంటూ ట్విట్టర్ వేదికగా మోదీ ఆహ్వానం పలికారు. దేశ ప్రజల సమష్టి అస్తిత్వానికి పట్టంకట్టే ఈ ఎపిసోడ్ ఎంతో ప్రత్యేకమైనదని అభివర్ణించారు.  

‘మన్ కీ బాత్’ ముఖ్యమైన మైలు రాయి చేరుకోనున్న నేపథ్యంలో ఈ ప్రసంగం అందరికీ చేరేలా బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా విస్తృత ఏర్పాటు చేశాయి. పార్టీ కార్యాలయాల్లో ఈ ప్రసంగాన్ని వినిపించనున్నారు. 

లండన్‌లోని భారత హైకమిషన్ కూడా ‘మన్ కీ బాత్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేసింది. 

బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అక్టోబర్ 3న ప్రజలను ఉద్దేశించి మోదీ ‘మన కీ బాత్‌లో’ తొలిసారిగా ప్రసంగించారు. 

దేశాభివృద్ధికి కీలకమైన రంగాల్లో ప్రభుత్వం, సామాన్య పౌరులు చేస్తున్న కృషిని మోదీ.. ‘మన్ కీ బాత్’ ప్రసంగాల్లో తరచూ ప్రస్తావిస్తూంటారు. తమ శక్తికొలది పరిస్థితుల్లో మెరుగైన మార్పు తీసుకురావాలంటూ పౌరులను ప్రోత్సహిస్తుంటారు. ముఖ్యంగా దేశం స్వావలంబన సాధించేందుకు అంకుర సంస్థలు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని గతంలో అనేక మార్లు పిలుపునిచ్చారు. 

‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగం దేశంలో సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించే స్ఫూర్తివంతమైన వేదికగా మారినట్టు బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ గతంలో చేసిన ఓ అధ్యయనంలో తేలింది.  

‘మన్ కీ బాత్‌’తో దేశంలో ప్రజాస్వామ్యం మరింత సుసంపన్నమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నెల నెలా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలనే ఓ కార్యక్రమాన్ని రూపొందించడం చరిత్రలో ఇదే తొలిసారని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

More Telugu News