Army: ఆర్మీ లెఫ్టినెంట్ గా గల్వాన్ అమరుడి భార్య

  • చెన్నై అకాడమీలో 11 నెలల కఠిన శిక్షణ పూర్తిచేసిన రేఖా సింగ్
  • ఆర్టిలరీ రెజిమెంట్ లో చేరిన ఐదుగురు మహిళల్లో రేఖ కూడా
  • ఆమె భర్త దీపక్ సింగ్ గల్వాన్ ఘర్షణలో మృత్యువాత
Wife of Galwan Martyr Lance Naik Deepak Singh Commissioned Into Indian Army As Lieutenant

గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భర్త అమరుడయ్యాడు.. దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన భర్త అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకుందా భార్య. పరీక్ష రాసి సైన్యంలోకి ఎంపిక అయింది, పదకొండు నెలల పాటు కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసింది. ట్రైనింగ్ పూర్తి చేసిన నలభై మంది మహిళల్లో టాప్ 5 స్థానంలో నిలిచి ఆర్టిలరీ రెజిమెంట్ లోకి ఎంపిక అయ్యింది. ఆమె పేరు రేఖా సింగ్.. భర్త దీపక్ సింగ్ గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించారు. దీపక్ కు ప్రభుత్వం వీర్ చక్ర (మరణానంతరం) అవార్డు ప్రకటించింది. 

అంతేకాదు, ఆర్టిలరీ రెజిమెంట్ లోకి ఇప్పటి వరకూ మహిళలను తీసుకోలేదు.. ఈ ఏడాది తొలిసారిగా మహిళలను తీసుకోవాలని ఆర్మీ చీఫ్ నిర్ణయించారు. చెన్నై అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 40 మంది మహిళల్లో ఐదుగురిని ఎంపిక చేశారు. అందులో ఒకరిగా నిలిచి రేఖా సింగ్ చరిత్ర సృష్టించారు. ఆర్టిలరీ రెజిమెంట్ విధుల్లో భాగంగా వీరంతా రాకెట్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ సర్వేలెన్స్ తదితర విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్మీ ఫ్రంట్ లైన్ లో సేవలు అందించాల్సి ఉంటుందని సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.

చెన్నైలోని ఆఫీసర్స్ అకాడమీలో శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఇందులో మొత్తం 200 మంది కాడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకుని ఆర్మీ పోస్టింగ్స్ అందుకున్నారు. ఇందులో రేఖా సింగ్ కూడా ఉన్నారు. ఆమె భర్త దీపక్ సింగ్ సైన్యంలో లాన్స్ నాయక్ గా సేవలందించారు. బీహార్ రెజిమెంట్ లో విధులు నిర్వహించారు. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణ జరగగా.. మన సైనికులు 20 మంది చనిపోయారు. అందులో కమాండర్ కర్నల్ సంతోష్ బాబుతో పాటు లాన్స్ నాయక్ దీపక్ సింగ్ కూడా ఉన్నారు.

More Telugu News