Nimmala Rama Naidu: టీడీపీ పాలనలో ఒక్కో విద్యార్థి రూ. 19,500 లబ్ధి పొందగా.. జగన్ వసతి దీవెన రూ. 15 వేలు మాత్రమే: రామానాయుడు

  • టీడీపీ హయాంలో విద్యలో ఏపీ 3వ స్థానంలో ఉందన్న రామానాయుడు 
  • ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయిందని ఎద్దేవా   
  • దోచుకో, పంచుకో చరిత్ర జగన్ దని విమర్శ
  • ఒంటరి వాడినని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్య 
Nimmala Ramanaidu fires on Jagan

టీడీపీ పథకాలకు పేర్లను మార్చి విడతల వారీగా మోసపు బటన్లను నొక్కడం ముఖ్యమంత్రి జగన్ కు అలవాటుగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో ఒక్కో విద్యార్థి రూ. 19,500 లబ్ధి పొందగా... జగన్ వసతి దీవెనలో లబ్ధి రూ. 15 వేలేనని విమర్శించారు. టీడీపీ హయాంలో నాణ్యమైన విద్యలో ఏపీ 3వ స్థానంలో ఉండగా... ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో 4,923 మంది విదేశీ విద్యకు వెళ్లగా... జగన్ పంపింది కేవలం 213 మందినేనని ఎద్దేవా చేశారు. డీఎస్సీ ద్వారా చంద్రబాబు 1.50 లక్షలకు పైగా ఉపాధ్యాయుల నియామకం చేయగా... జగన్ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా జరపలేదని విమర్శించారు. 6 లక్షల మందికి చంద్రబాబు నిరుద్యోగ భృతిని ఇవ్వగా... జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతిని రద్దు చేశారని అన్నారు.  
 
పులి కథ పేరుతో జగన్ రెడ్డి చెప్పిన పిట్ట కథ ఆయనకే వర్తిస్తుందని రామానాయుడు ఎద్దేవా చేశారు. హత్యల చరిత్ర జగన్ రెడ్డిది కాగా అభివృద్ధి చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. దోచుకో, తినుకో, పంచుకో చరిత్ర జగన్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని అన్నారు. తన అవలక్షణాలను ఎదుటి వారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజమని దుయ్యబట్టారు. తన కేసుల మాఫీ కోసం అప్పర్ భద్ర ద్వారా తుంగభద్రలో రాయలసీమ నీటి హక్కులను కాలరాస్తున్న కర్ణాటకను జగన్ రెడ్డి అడ్డుకోలేదని మండిపడ్డారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన రాయలసీమ క్యాన్సర్ గడ్డ జగన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. తాను ఒంటరి వాడినని జగన్ చెప్పుకోవడం పచ్చి అబద్ధమని... ఆయనకు సాక్షి మీడియా ఎస్టేట్, అబద్దాల కాలుష్యం వెదజల్లే పీకే సోషల్ మీడియా, అలాగే చీకటి పొత్తులు, ధన రాసులు, రౌడీమూక పుష్కలంగా ఉన్నాయని అన్నారు.

More Telugu News