గంటన్నర గడిచినా... విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై దాడి

Attack on Theatre after cinema not projecting
  • మూసాపేటలో ఫస్ట్ షో కోసం టిక్కెట్ తీసుకున్న ప్రేక్షకులు
  • గంటన్నర గడిచినా షో వేయకపోవడంతో ఆగ్రహంతో దాడి
  • డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు సింగిల్ లైన్ కట్టమన్నారని ఆవేదన
సినిమా కోసం థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు టిక్కెట్ కొనుగోలు చేసి, లోనికి వెళ్లిన గంటన్నర తర్వాత కూడా షో వేయక పోవడంతో ఆగ్రహానికి గురై, థియేటర్ పైన దాడి చేసిన ఘటన జరిగింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని మూసాపేటలో చోటు చేసుకుంది. ఇక్కడి ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లో... నటుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఆదివారం ఫస్ట్ షో ఆరు గంటలకు ప్రారంభం కావాలి.

ప్రేక్షకులు టిక్కెట్ కొనుగోలు చేసి, లోనికి వెళ్లి గంటకు పైగా షో కోసం వేచి చూశారు. షో మాత్రం ఎంతకూ ప్రారంభం కాలేదు. దీంతో పలువురు ప్రేక్షకులు ఆగ్రహంతో థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న సనత్ నగర్ పోలీసులు దాడి చేసిన ప్రేక్షకులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు, టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి థియేటర్ యాజమాన్యం డబ్బులను తిరిగి ఇచ్చింది.

ఆరు గంటల సినిమా కోసం తాము వచ్చామని, ఇక్కడ విరూపాక్ష ప్రదర్శిస్తున్నారని, తాము సినిమా కోసం గంటన్నర పాటు వేచి చూశామని కానీ సినిమా ప్రారంభం కాలేదని ఓ ప్రేక్షకుడు చెప్పారు. గంటన్నర గడిచినా షో ప్రారంభం కాకపోయేసరికి డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వమంటే సింగిల్ లైన్ కట్టాలని చెబుతున్నారని, వెయ్యి మంది ఉన్నారని, వీరికి సింగిల్ లైన్ ఏం సరిపోతుందని ప్రశ్నించారు.
Go Back to Shorts
Sai Dharam Tej
Hyderabad

More Telugu News