Raghunandan Rao: ఏ చర్యకైనా సిద్ధం: రఘునందన్ కు మంత్రి నిరంజన్ సవాల్

  • భూకబ్జా ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి కౌంటర్
  • ఆర్డీఎస్ కోసం సేకరించిన భూముల ప్రాంతంలో తమకు భూములే లేవని వ్యాఖ్య
  • ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూడవచ్చని సవాల్
Minister Niranjan Reddy challenges Raghunandan Rao

తనపై భూకబ్జా ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 160 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ లో ప్రభుత్వ, ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయని రఘునందన్ చేసిన ఆరోపణలు సరికాదన్నారు. ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలన్నారు. 

తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఎప్పుడైనా తన భూమి ఉన్న చోటకు వచ్చి చూడవచ్చని నిరంజన్ రెడ్డి చెప్పారు. తనపై చేసిన ఆరోపణలకు గాను బేషరతుగా క్షమాపణలు చెప్పి, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.

రఘునందన్ పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడారని, ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. తమ కుటుంబానికి భూములు ఉన్నచోట ఆర్డీఎస్ భూములే లేవన్నారు. అంతేకాదు, రఘునందన్ రావు ముందుకొస్తే, భూములు దగ్గరుండి సర్వే చేయిస్తానని అన్నారు.

రఘునందన్ రావు తన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే ఆయన ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఆయన తన ఆరోపణలు రుజువు చేస్తే తాను ఏ చర్యకైనా సిద్ధమన్నారు. 

More Telugu News