Budda Venkanna: దోచుకున్న డబ్బుల వాటాల దగ్గరే జగన్ కు, విజయసాయి రెడ్డికి తేడాలొచ్చాయి: బుద్దా వెంకన్న

  • జగన్ కరోనా అయితే.. చంద్రబాబు బూస్టర్ డోస్ అన్న బుద్దా వెంకన్న
  • జగన్ రూ.5 లక్షల కోట్లు దోచేయడానికి దుకాణం విశాఖకు మారుస్తానంటున్నారని విమర్శ
  • తానూ విశాఖలోనే మకాం పెట్టి వారి అవినీతిని బట్టబయలు చేస్తానని హెచ్చరిక 
tdp leader budda venkanna fires on cm jaganmohan reddy

జగన్ కరోనా వైరస్ అయితే.. చంద్రబాబు బూస్టర్ డోస్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ఓ రాష్ట్ర నాయకుడు కాదని, జాతీయ నాయకుడని చెప్పారు. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ‘‘విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో 50 వేల కోట్లు దోచేశారు. ఆ వాటాల దగ్గరే సీఎంకు, విజయసాయి రెడ్డికి తేడాలు వచ్చాయి’’ అని ఆరోపించారు. ఇప్పుడు జగన్ రూ.5 లక్షల కోట్లు దోచేయడానికి దుకాణం విశాఖకు మారుస్తానంటున్నారని విమర్శించారు.

తాను కూడా విశాఖలోనే మకాం పెట్టి వారి అవినీతిని బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. విశాఖలో కబ్జా చేసిన భూములన్నింటినీ టీడీపీ అధికారంలోకి రాగానే బాధితులకు అప్పగిస్తామని బుద్దా వెంకన్న హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత కేశినేని చిన్ని మాట్లాడుతూ... ‘‘చంద్రబాబుపై ఎవరైనా విమర్శలు చేస్తే సహించేది లేదు. వచ్చే పుట్టిన రోజు నాటికి చంద్రబాబుని గెలిపించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెడతాం’’ అని చెప్పారు. 

టీడీపీ అధికార ప్రతినిధి నాగూల్ మీరా మాట్లాడుతూ.. ‘‘అభివృద్ధి, సంక్షేమానికి పేటెంట్ చంద్రబాబుదే. ఆయన గెలుపు తెలుగు ప్రజలకు అవసరం. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ అడిగిన ఒకే ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఈసారి అటు సూర్యుడు ఇటు పొడిచినా జగన్ గెలవడు’’ అని అన్నారు.

More Telugu News