YS Avinash Reddy: సునీల్ తల్లి, ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకాకు సంబంధాలు ఉన్నాయి: బెయిల్ పిటిషన్ లో అవినాశ్ రెడ్డి ఆరోపణలు

  • వివేకాకు అక్రమ సంబంధాలు ఉన్నాయన్న అవినాశ్ రెడ్డి
  • సునీల్, ఉమాశంకర్ ఇళ్లలో లేనప్పుడు వివేకా వాళ్ల ఇళ్లకు వెళ్లేవాడని ఆరోపణ
  • వివేకా హత్యతో తనకు సంబంధం లేదని వ్యాఖ్య
YS Viveka has illegal contacts with other women say Avinash Reddy

వివేకా హత్య కేసులో ఈ మధ్యాహ్నం సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ లో అవినాశ్ పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. వివేకాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని... ఏ2 సునీల్ యాదవ్ తల్లితో పాటు, ఏ3 ఉమాశంకర్ రెడ్డి భార్యతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. వీరిద్దరూ వాళ్ల ఇళ్లలో లేని సమయంలో వివేకా వారి నివాసాలకు వెళ్లేవారని చెప్పారు.

వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సీఆర్పీసీ 160 కింద సీబీఐ తనకు నోటీసులు జారీ చేసిందని, తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిందని చెప్పారు. వివేకా కూతురు సునీత, స్థానిక ఎమ్మెల్సీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీబీఐ అధికారి అందరూ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కుట్రలతో తనను ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు. కేవలం గూగుల్ టేకౌట్ ద్వారా తనను నిందితునిగా చేర్చారని చెప్పారు. దస్తగిరిని సీబీఐ అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లి చాలా రోజులు అట్టిపెట్టుకున్నారని, డబ్బులిచ్చి ఆయనను అప్రూవర్ గా మార్చారని ఆరోపించారు. సంబంధం లేని కేసులో ఇరికించాలనుకుంటున్నారని, న్యాయంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరుతున్నానని విన్నవించారు.

More Telugu News