Kishan Reddy: సీబీఐపై అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెస్పాన్స్

  • వివేకా హత్యకేసులో భాస్కర్ రెడ్డి అరెస్టుపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
  • తాము చెప్పిన విషయాలు సీబీఐ పట్టించుకోవడం లేదని ఆరోపణ
  • అవినాశ్ రెడ్డికి మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్
  • కేసు ఓ కొలిక్కి తెచ్చేందుకే సీబీఐ పని చేస్తోందని స్పష్టీకరణ
Kishan reddy responds to avinash reddy comments over cbi arresting bhaskar reddy in connection with viveka murder case

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన కుమారుడు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పిన మంత్రి..వివేకా కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకే సీబీఐ పని చేస్తోందని తేల్చి చెప్పారు. కేజ్రీవాల్‌కు ఎలా నోటీసులు ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారని, అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు చేయొద్దా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలు ఇవీ..
తన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు గురించి ప్రస్తావిస్తూ ఈ విషయంలో తనకు మాటలు రావడం లేదని అవినాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారన్నారు. కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని, సిల్లీ విషయాలతో వ్యక్తులే లక్ష్యంగా విచారణ జరుగుతోందని వ్యాఖ్యానించారు. వివేకా హత్య విషయం తనకంటే ముందే వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డికి తెలుసని చెప్పారు. సమాచారం ఇచ్చిన తననే దోషిగా నిలబెట్టారని చెప్పారు. 

హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. వివేకా తన రెండో భార్యకే ఆస్తి రాసిద్దామనుకున్నారని, ఇందుకు సంబంధించి రౌండ్ సీల్స్, పత్రాలు వివేకా ఇంట్లో దొరికాయని చెప్పుకొచ్చారు. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత స్టాంప్ పేపర్లు పరిశీలన, దొంగతనం జరిగిందని, ఆ పేపర్లు పోతే సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. తాము చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించడం లేదని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

More Telugu News