‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాలా.. కోడికత్తితో భుజంపై గీతలు పెట్టించుకొని జగన్ డ్రామాలు: టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు
- అవినీతి పత్రికను అడ్డుపెట్టుకొని జగన్ విష ప్రచారం చేస్తున్నారన్న మాణిక్యరావు
- సొంత బాబాయ్ ని అత్యంత కిరాతకంగా హతమార్చారని ఆరోపణ
- 4 ఏళ్లుగా ప్రజల్ని వేధిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపాటు
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ దుర్యోధన సినిమా మాదిరి ముఖ్యమైన అవయవాలకు తగలకుండా, కోడికత్తితో భుజంపై గీతలు పెట్టించుకొని డ్రామాలు ఆడారని విమర్శించారు. ‘‘సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. అంతకంటే దారుణంగా ఆ నేరాన్ని చంద్రబాబుపైకి నెట్టి, జగన్ అధికారాన్ని సాధించారు’’ అని ఆరోపించారు. 4 ఏళ్లుగా ప్రజల్ని వేధిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.
దళితులపై కపట ప్రేమ చూపుతున్నారని మాణిక్యరావు విమర్శించారు. దళితులకు తాను బిడ్డనంటూ, మామనంటూ మరోసారి వారిపై ‘విష మమకారం’ నటిస్తూ వారి అభివృద్ధి, ఎదుగుదలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దళితులకు, అణగారిన వర్గాలకు అంబేద్కర్ దేవుడని, ఆ మహానీయుడి కంటే తాను గొప్పవాడినన్నట్టు ఆయన పేరు తొలగించి, జగన్ తన పేరుతో ఉత్తుత్తి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశంతోనే దళితుల అభివృద్ధి, ఆత్మగౌరవం ఇనుమడిస్తాయని చెప్పారు.