GITAM University: పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణం.. విశాఖ గీతం వర్సిటీ వద్ద మళ్లీ ఉద్రిక్తత

  • వర్సిటీలో గుర్తించిన ప్రభుత్వ భూమిలో కంచె నిర్మాణం
  • నిర్మాణ సామగ్రితో వర్సిటీలోకి ప్రవేశించిన రెవెన్యూ అధికారులు
  • వర్సిటీకి దారితీసే రోడ్లపై రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లు
  • ఐడీ కార్డులు చూపిస్తేనే స్థానికులకు అనుమతి
Tensions at Visakha Gitam University

విశాఖపట్టణం రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలో ప్రభుత్వ భూమిని గుర్తించినట్టు గతంలో చెప్పిన అధికారులు ఇప్పుడు అక్కడ కంచె నిర్మాణం చేపట్టేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తీసుకుని వర్సిటీలోకి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోని డెంటల్ కాలేజీ వద్ద కిలోమీటర్ మేర కంచె నిర్మాణం చేపట్టారు.

వర్సిటీలో కంచె నిర్మాణం నేపథ్యంలో ఈ తెల్లవారుజామున 2 గంటల నుంచే గీతం వర్సిటీకి దారితీసే అన్ని రోడ్లపైనా పోలీసులు మోహరించి ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఎండాడ, రుషికొండ మార్గాల్లో వర్సిటీకి రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐడీ కార్డులు చూపించిన స్థానికులను మాత్రం అనుమతించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో గీతం కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News