Karnataka: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం.. కింగ్ మేకర్ మళ్లీ కుమారస్వామే: పీపుల్స్ పల్స్ సర్వే

  • ఏ పార్టీ కూడా మేజిక్ ఫిగర్ ను సాధించలేదని సర్వేలో తేలిన వైనం
  • ఎక్కువ స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న కాంగ్రెస్
  • సిద్ధరామయ్య సీఎం కావాలని కోరుకుంటున్న ఎక్కువ మంది ప్రజలు
Hung assembly in Karnataka says Peoples Pulse Survey

మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ కర్ణాటకలో ప్రీపోల్ సర్వేను నిర్వహించింది. 

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను మెజార్టీకి అవసరమైన 113 సీట్లను ఏ పార్టీ కూడా గెలుచుకోలేదని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. కర్ణాటకలో మళ్లీ హంగ్ వస్తుందని వెల్లడయింది. జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కానున్నారని తేలింది. 

ప్రాబబిలిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ పద్ధతిలో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ప్రతి నియోజకర్గంలో ఐదు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసి, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం 5,600 శాంపిల్స్ సేకరించడం జరిగింది. పురుషులు, స్త్రీలు, పేదలు, సంపన్నులు, కులం, వయస్సు, ప్రాంతం ఇలా అన్నీ తగు నిష్పత్తిలో ఉండేలా శాంపిల్స్ ను సేకరించి, అనలైజ్ చేశారు. 

పీపుల్స్ పల్స్ సర్వే హైలైట్స్:

  • కర్ణాటకలో ఏ పార్టీకి అధికారాన్ని ఏర్పాటు చేసేంత (113 అసెంబ్లీ స్థానాలు) మెజార్టీ రాదు. 
  • కాంగ్రెస్ అధిక స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. 
  • కాంగ్రెస్ కు 98 (95 నుంచి 105 స్థానాలు), బీజేపీకి 92 (90 నుంచి 100 మధ్య సీట్లు) వస్తాయి. 
  • కుమారస్వామి జేడీఎస్ పార్టీ 27 సీట్లను (25 నుంచి 30 మధ్య) గెలుచుకుంటుంది. 
  • గాలి జనార్దన్ రెడ్డి స్థాపించిన కేఆర్పీపీ పార్టీకి 1 లేదా 2 సీట్లు రావచ్చు. 
  • ఎంఐఎం, ఎస్డీపీఐ, ఆప్ పార్టీలకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు.  
  • 2018 నాటి హంగ్ ఫలితాలు మళ్లీ పునరావృతం అవుతాయి. 
  • కాంగ్రెస్ కు 41 శాతం, బీజేపీకి 36 శాతం, జేడీఎస్ కు 16 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 
  • గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ బలం మరో 18 సీట్లు పెరగొచ్చు. ఇదే సమయంలో బీజీపీ 12 సీట్లు, జేడీఎస్ 10 సీట్లను కోల్పోనున్నాయి. 
  • ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే విషయంలో ఎక్కువ మంది ప్రజలు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకే జై కొట్టారు. 
  • సిద్ధరామయ్య సీఎంగా ఉండాలని 32 శాతం మంది కోరుకున్నారు. యెడ్యూరప్పకు 25 శాతం మంది, ప్రస్తుత సీఎం బొమ్మైకు 20 శాతం మంది, కుమారస్వామికి 18 శాతం మంది, డీకే శివకుమార్ కు 5 శాతం మంది అనుకూలంగా స్పందించారు. 
  • కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. 
  • ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సాధించేంత మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో కుమారస్వామి మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ లేదా బీజేపీకి కుమారస్వామి మద్దతు అవసరమవుతుంది.

 

More Telugu News