Harish Rao: నాలుగేళ్ల తర్వాత మెడికల్ కాలేజీకి కొబ్బరికాయ కొడతారట!: హరీశ్ రావు

  • ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై మంత్రి సెటైర్లు
  • బీజేపీది పని తక్కువ.. ప్రచారం ఎక్కువని విమర్శ
  • బీఆర్ఎస్ ది చేతల ప్రభుత్వమని చెప్పిన హరీశ్ రావు
Minister Harish Rao Satirical comments on PM Modi Over His Telangana Tour

ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని వస్తున్నారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఏప్రిల్ 8న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. ప్రధాని టూర్ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత హడావుడి చేస్తున్నారు.. గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరి కాయ కొట్టినం, మేమెంతగా చెప్పుకోవాలి’ అని మంత్రి అడిగారు.

బీజేపీది పని తక్కువ ప్రచారం ఎక్కువ అని, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే బీజేపీ నేతల పని అని ఎద్దేవా చేశారు. తమది (బీఆర్ఎస్) చేతల ప్రభుత్వమని మంత్రి చెప్పారు. పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారని వివరించారు. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో, 20 ఏళ్ల తెలుగుదేశం పాలనలో చేయని పనులను సీఎం కేసీఆర్ 8 ఏళ్లలోనే పూర్తిచేసి చూపించారని హరీశ్ రావు కొనియాడారు. మన దగ్గర కేసీఆర్ అనే అద్భుత దీపం ఉందని ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కంటి వెలుగు పథకం గురువారానికి కోటి మందికి చేరువైన సందర్భంగా సదాశివపెట్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.

More Telugu News