janagama: ఒకరి తర్వాత మరొకరుగా.. ఆత్మహత్య చేసుకున్న జనగామ ఎస్సై దంపతులు

  • ఉదయం బాత్రూంలో ఉరేసుకున్న ఎస్సై భార్య
  • భార్య మృతదేహం చూసి కన్నీరుమున్నీరైన ఎస్సై శ్రీనివాస్
  • ఆ తర్వాత కాసేపటికే గదిలోకి వెళ్లి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఎస్సై
  • కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు
janagama SI Srinivas suicide

జనగామలో గురువారం కలకలం రేగింది. ఎస్సై శ్రీనివాస్ భార్య ఉదయం ఉరి వేసుకుని చనిపోయింది. భార్య మరణంతో కన్నీరుమున్నీరైన ఎస్సై.. ఆ తర్వాత ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇరువురూ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎస్సై శ్రీనివాస్, ఆయన భార్య స్వరూపల మధ్య గొడవ జరిగింది. గురువారం ఉదయం స్వరూప బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయింది. భార్య ఆత్మహత్యతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. భార్య మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ‘ఎంత పనిచేశావు స్వరూపా’ అంటూ శ్రీనివాస్ గుండెలవిసేలా రోదించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏడుస్తున్న శ్రీనివాస్ ను బంధువులు, స్నేహితులు ఓదార్చుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ నుదుట గాయం అయినట్లు కనిపిస్తోంది. అయితే, ఆ తర్వాత కాసేపటికి మరో గదిలోకి వెళ్లిన శ్రీనివాస్.. తన సర్వీస్ రివాల్వర్ తో నుదుటిపై కాల్చుకుని చనిపోయాడు. కాగా, గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, స్వరూప దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. కాగా, ఎస్సై దంపతుల ఆత్మహత్యలపై దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

More Telugu News