TSPSC: పేపర్ లీకేజీ కేసులో కీలక పాత్ర రాజేశ్వర్ దే!

AE paper sold for Rs 40 lakhs by rajeswar says officials
  • ఏఈ పేపర్ అమ్మకానికి రూ.40 లక్షలు
  • అడ్వాన్స్ గా రూ.23 లక్షలు తీసుకుని ఒప్పందం
  • నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి
  • ఈ నెల 11 న కోర్టుకు రిపోర్టును అందజేయనున్న సిట్ బృందం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‎పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను ప్రశ్నిస్తుంటే సంచలన విషయాలు బయటపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏఈ పేపర్ లీకేజీలో కేతావత్ రాజేశ్వర్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ పేపర్ ను రూ. 40 లక్షలకు అమ్మాడని, ఇందుకోసం అభ్యర్థుల నుంచి రూ.25 లక్షలు అడ్వాన్సుగా, పరీక్ష ఫలితాలు వచ్చాక మిగతా సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు బయటపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి చేతులు మారిన నగదులో నుంచి రూ.8.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రవీణ్ నుంచి రేణుకకు పేపర్..
టీఎస్‎పీఎస్సీ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ రూమ్ లో నుంచి ఏఈ పేపర్ ను ప్రవీణ్ కుమార్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. పెన్ డ్రైవ్ లో కాపీ చేసి బయటకు తీసుకొచ్చాడు. ఆ పేపర్ ను అమ్మేందుకు రూ.10 లక్షలకు రేణుకతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ గా రూ. 5 లక్షలు తీసుకున్నాడు. రేణుక తన భర్త డాక్యా నాయక్ తో కలిసి సమీప బంధువు రాజేశ్వర్ తో పేపర్ అమ్మకానికి సంబంధించి మాట్లాడింది. రాజేశ్వర్ మధ్యవర్తులు గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రలకు ఏఈ పేపర్ ను రూ.40 లక్షలకు విక్రయించాడు. అడ్వాన్స్ గా అందిన రూ.23 లక్షల్లో రూ.10 లక్షలను రేణుకకు అందించాడు. 

ఉద్యోగుల విచారణ..
ఈ కేసులో ఇప్పటికే టీఎస్‎పీఎస్సీ ఉద్యోగులు పలువురిని సిట్ అధికారులు విచారించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని పది దఫాలుగా సుమారు 20 గంటల పాటు ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల భద్రత, యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లను ప్రవీణ్ ఎలా తెలుసుకున్నాడనే వివరాలను సేకరించారు. ఆపై టీఎస్‎పీఎస్సీ సెక్రటరీ అనితారామచంద్రన్ ను కూడా విచారించారు. తాజాగా టీఎస్‎పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వివరణ కోరేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 11న తన రిపోర్టును కోర్టుకు అందజేయాల్సి ఉండడంతో సిట్ బృందం విచారణలో వేగం పెంచింది.
TSPSC
Paper leak
rajeswar
ae paper

More Telugu News