Andhra Pradesh: ఏపీ పోలీసులకు ఇక్కడేం పని.. గో బ్యాక్: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఒడిశాలోని కొఠియా గ్రూప్ గ్రామాల్లో పర్యటించిన ధర్మేంద్ర ప్రధాన్
  • విధి నిర్వహణలో ఉన్న ఏపీ పోలీసును మీరెవరంటూ ప్రశ్నించిన మంత్రి
  • కొఠియా ఒడిశాదని చెబుతూ వెళ్లిపోవాలని ఆదేశం
 Dharmendra Pradhan directs Andhra Pradesh officials to go back

‘ఏపీ పోలీస్ గో బ్యాక్’ అంటూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘ఉత్కల్ దిబస’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధర్మేంద్ర ప్రధాన్ నిన్న ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఒడిశాలోని కొఠియా గ్రూప్ గ్రామాల్లో పర్యటించారు. అందులో భాగంగా పట్టుచెన్నూరు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొఠియా సీఐ రోహిణీపతిని మీరెవరని మంత్రి ప్రశ్నించారు. దీంతో తాము ఏపీ పోలీసులమని బదులిచ్చారు. 

ఆ వెంటనే మంత్రి కల్పించుకుని ఏపీ పోలీసులకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. దీంతో కొఠియాలోని 21 గ్రామాలు ఇరు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని సీఐ చెప్పారు. ఈసారి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కొఠియా ఏపీది కాదని, ఒడిశాదేనని చెబుతూ.. ‘ఏపీ పోలీస్ గో బ్యాక్’ అని ఆదేశించారు. మంత్రి అలా అనడంతో ఆ వెంటనే ఆయన అనుచరులు కూడా ఏపీ పోలీస్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.

ఏపీ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిపై ఒడిశా అధికార పార్టీ బీజేడీ తీవ్రంగా స్పందించింది. ఒడిశా-ఆంధ్ర సరిహద్దులోని కొఠియా గ్రామాలపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ సహా ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రులు కొఠియా వివాదాన్ని పట్టించుకోలేదని బీజేడీ నాయకుడు ప్రదీప్ మాఝీ మండిపడ్డారు.

More Telugu News