Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. 13 ఏళ్ల బాలిక ప్రాణం తీసిన గుండెపోటు!

  • ఆరో తరగతి చదువుతున్న బాలిక
  • నిద్రలో ఉండగానే అస్వస్థత
  • తనకేదో అవుతోందంటూ నానమ్మను నిద్రలేపిన బాలిక
  • మంచంపై కూర్చుని అలాగే ఒరిగిపోయి మృతి చెందిన వైనం
13 Year Old girl died with heartattack

సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండెపోటు ఇప్పుడు పసిపిల్లల ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తోంది. గుండెపోటుకు గురై ఇటీవల పలువురు యువకులు మృత్యువాత పడ్డారు. డ్యాన్సు చేస్తుండగా కొందరు, ఆడుకుంటూ కొందరు, జిమ్‌లో వ్యాయామం చేస్తూ మరికొందరు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. ఇప్పుడు అంతకుమించి బాధించే ఘటన జరిగింది. 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని బోడతండాకు చెందిన స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం శ్రీరామ నవమి స్కూలుకు సెలవు కావడంతో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంది. రాత్రి నిద్రపోయిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైంది. తనకేదో అవుతోందంటూ నానమ్మను నిద్రలేపింది. మంచంపై కూర్చుని ఒక్కసారిగా ఒరిగిపోయింది. తల్లిదండ్రులు వెంటనే కుమార్తెను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందడంతో బోరున విలపించారు. స్రవంతి మృతితో తండాలో విషాదం నెలకొంది.

More Telugu News