Chandrababu: 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంపై చంద్రబాబు సమీక్ష

  • ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ
  • ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విరామం
  • ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలన్న చంద్రబాబు
  • పార్టీ శ్రేణులకు అభినందనలు
Chandrababu reviews on Idem Kharma Mana Rashtraniki

టీడీపీ నిర్వహిస్తున్న 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 'ఇదేం ఖర్మ' కార్యక్రమ నిర్వహణపై క్లస్టర్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఇదేం ఖర్మ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేయాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రణాళికతో పనిచేయాలని శ్రేణులకు సూచించారు. 

పార్టీ నిర్వహిస్తున్న 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టం అయ్యిందని వ్యాఖ్యానించారు. 

108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారంటూ కార్యకర్తలు, నేతలను చంద్రబాబు అభినందించారు. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ఎదిరించడంలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కి పోరాటాలు చేశారని ప్రశంసించారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' ప్రోగ్రాం నిర్వహణలో ముందున్న ఆయా నియోజవకర్గాల నేతలను ప్రశంసించారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమానికి కొంత విరామం వచ్చిందని... తిరిగి వెంటనే అన్ని చోట్లా ప్రారంభించాలని చంద్రబాబు నేతలను కోరారు. ఏప్రిల్ మొదటి వారంలో మూడు జోనల్ సమావేశాలు పూర్తి చేసుకుని... తాను కూడా 'ఇదేం ఖర్మ' కార్యక్రమంలో పలు జిల్లాల్లో పాల్గొంటానని పార్టీ నేతలకు తెలిపారు.

More Telugu News