Lotay Tshering: డోక్లాం వివాదంలో భారత్ కు ఇబ్బందికరంగా భూటాన్ ప్రధాని వ్యాఖ్యలు

Bhutan PM Lotay Tshering comments in Doklam issue
  • ఢోక్లాం పీఠభూమిపై భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన
  • గత ఆరేళ్లుగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
  • సమస్య పరిష్కారంలో భాగమయ్యేందుకు చైనాకు కూడా హక్కు ఉందన్న షెరింగ్
  • భారత్, చైనా, భూటాన్ సమాన దేశాలని వెల్లడి
సరిహద్దులకు సమీపంలోని ఢోక్లాం పీఠభూమికి సంబంధించి గత ఆరేళ్లుగా భారత్, చైనా మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఢోక్లాం వివాదం పరిష్కారంలో భాగమయ్యేందుకు చైనాకు కూడా హక్కు ఉందని షెరింగ్ వ్యాఖ్యానించారు.

ఢోక్లాంలో చైనా అక్రమంగా ప్రవేశించిందంటూ భారత్ ఓవైపు తీవ్రంగా నిరసిస్తున్న వేళ... భూటాన్ ప్రధాని వ్యాఖ్యలు కచ్చితంగా ఇబ్బంది కలిగించేవే. ఢోక్లాం పీఠభూమి అంశంలో భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, షెరింగ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

భారత్, చైనా, భూటాన్ సమాన దేశాలు అని స్పష్టం చేశారు. ఇక్కడ పెద్ద దేశం, చిన్న దేశం అనే తేడా లేదని పేర్కొన్నారు. మూడు దేశాలకు సమాన న్యాయం జరిగేలా చర్చలు ఉండాలని, ఈ చర్చల్లో పాల్గొనేందుకు తాము కూడా సిద్ధమేనని భూటాన్ ప్రధాని ప్రకటించారు. 

షెరింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ కు ఇబ్బందికర వాతావరణం సృష్టించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Lotay Tshering
Doklam
India
China
Bhutan

More Telugu News