Telugu Warriors: సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ విజేతగా నిలిచిన టాలీవుడ్ జట్టు

  • గతరాత్రి విశాఖలో ఫైనల్
  • భోజ్ పురి దబాంగ్స్ ను ఓడించి టైటిల్ అందుకున్న తెలుగు వారియర్స్
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన అఖిల్ అక్కినేని
  • తెలుగు వారియర్స్ కు ఇది నాలుగో సీసీఎల్ టైటిల్
Telugu Warriors wins CCL title

మొత్తం 8 జట్లు పాల్గొన్న సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)లో టాలీవుడ్ జట్టు తెలుగు వారియర్స్ టైటిల్ విజేతగా అవతరించింది. నిన్న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్లో తెలుగు వారియర్స్... భోజ్ పురి దబాంగ్స్ పై విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తెలుగు వారియర్స్.... భోజ్ పురి జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. తొలి ఇన్నింగ్స్ లో భోజ్ పురి జట్టు 6 వికెట్లకు 72 పరుగులు చేయగా, తెలుగు వారియర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 104 పరుగులు చేసింది. కెప్టెన్ అఖిల్ అక్కినేని 67 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

రెండో ఇన్నింగ్స్ లో భోజ్ పురి టీమ్ 6 వికెట్లకు 89 పరుగులు చేయగా... 58 పరుగుల టార్గెట్ ను తెలుగు వారియర్స్ జట్టు ఈజీగా ఛేదించింది. కేవలం ఒక వికెట్ (తమన్) చేజార్చుకుని విజయం సాధించింది. అశ్విన్, సచిన్ అజేయంగా నిలిచారు. అఖిల్ అక్కినేనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. 

సీసీఎల్ చరిత్రలో తెలుగు వారియర్స్ కు ఇది నాలుగో టైటిల్. గతంలో 2015, 2016, 2017లో వరుసగా మూడు టైటిళ్లు చేజిక్కించుకుని హ్యాట్రిక్ నమోదు చేసింది. కరోనా సంక్షోభం కారణంగా గత మూడేళ్లుగా సీసీఎల్ టోర్నీ నిర్వహించలేదు.

More Telugu News