రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

All set for MLA quota MLC elections in  AP
  • ఏపీలో 7 ఖాళీలకు ఎన్నికలు
  • మార్చి 23న అసెంబ్లీ వేదికగా పోలింగ్
  • చివరి నిమిషంలో అభ్యర్థిని బరిలో దింపిన టీడీపీ
  • రెబెల్స్ ఓట్లపై ఆశలు!
ఏపీ రాజకీయాల్లో రేపు (మార్చి 23)న మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 7 స్థానాల కోసం 8 మంది బరిలో ఉన్నారు. అసెంబ్లీ వేదికగా జరిగే ఈ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 

కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో వైసీపీ ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలకు అవగాహన కలిగించేలా ఇప్పటికే మాక్ పోలింగ్ నిర్వహించింది. సంఖ్యాబలం అనుకూలంగా లేనప్పటికీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. టీడీపీ తమ అభ్యర్థిగా మహిళా నేత పంచుమర్తి అనురాధతో పోటీ చేయిస్తోంది. 

టీడీపీ గత ఎన్నికల్లో 23 సీట్లు గెలవగా, వారిలో ఇప్పుడు నలుగురు వైసీపీ పక్షాన ఉన్నారు. దాంతో టీడీపీ ప్రస్తుత బలం 19 అనే భావించాలి. అయితే ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే తప్పనిసరిగా 22 ఓట్లు కావాలి. ఆ లెక్కన చూస్తే టీడీపీకి అవకాశాలు తక్కువ. 

అయితే రహస్య ఓటింగ్ కాబట్టి, వైసీపీ రెబెల్స్ తమకు అనుకూలంగా ఓటు వేసే అవకాశాలున్నాయని టీడీపీ భావిస్తోంది. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేయడం తెలిసిందే. వీరిద్దరి ఓట్లు ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
MLC Elections
MLA Quota
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News