RCB: డబ్ల్యూపీఎల్: చివరి మ్యాచ్ లోనూ ఆర్సీబీ జట్టుకు ఓటమే!

  • డబ్ల్యూపీఎల్ లో బెంగళూరు వర్సెస్ ముంబయి
  • తొలుత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసిన బెంగళూరు
  • 16.3 ఓవర్లలో ఛేదించిన ముంబయి ఇండియన్స్
RCB ended campaign with another lose

భారత్ లో ఐపీఎల్ తరహాలో అమ్మాయిల క్రికెట్ లీగ్ డబ్ల్యూపీఎల్ ను ఈ ఏడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 4న ప్రారంభమైన ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్ టోర్నీ ఆరంభం నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు చివరి లీగ్ మ్యాచ్ లోనూ దారుణంగా ఆడింది. ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ స్మృతి మంధన 24, ఎలిస్ పెర్రీ 29, రిచా ఘోష్ 29 పరుగులు చేశారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్ 3, నాట్ షివర్ 2, ఇస్సీ వాంగ్ 2, సాయికా ఇషాక్ 1 వికెట్ తీశారు.

అనంతరం, స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 16.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హేలీ మాథ్యూస్ 24, యస్తికా భాటియా 30, అమేలియా కెర్ 31 (నాటౌట్) పరుగులు చేశారు.

More Telugu News