Pramod Kumar: తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ పబ్లిసిటీ ఇన్చార్జి ప్రమోద్ కుమార్ కన్నుమూత

  • విజయవాలో తుదిశ్వాస విడిచిన ప్రమోద్ కుమార్
  • 300 చిత్రాలకు పైగా పబ్లిసిటీ బాధ్యతలు
  • పలు చిత్రాల్లో నటించిన వైనం
  • రెండు సినిమాలకు నిర్మాతగా ప్రమోద్ కుమార్
Tollywood senior publicity incharge Pramod Kumar passes away

తెలుగు సినిమా రంగంలో విషాదం చోటుచేసుకుంది. 300కి పైగా సినిమాలకు పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన వీరమాచనేని ప్రమోద్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆయన విజయవాడలో తుదిశ్వాస విడిచారు. 

ప్రమోద్ కుమార్ 38 ఏళ్ల పాటు సినీ రంగంలో పబ్లిసిటీ ఇన్చార్జిగా కొనసాగారు. ఆయన పబ్లిసిటీ అందించిన 31 చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 

ప్రమోద్ కుమార్ కొన్ని చిత్రాల్లోనూ నటించారు. అంతేకాదు, తన మిత్రులతో కలిసి దొంగ పోలీస్ (మోహన్ బాబు హీరో), గరం మసాలా అనే చిత్రాలను నిర్మించారు. 

ప్రమోద్ కుమార్ రచయిత కూడా. తెర వెనుక తెలుగు సినిమా అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. ఈ పుస్తకానికి గాను ఆయన నంది అవార్డు అందుకున్నారు. అంతకుముందు సుబ్బయ్య గారి మేడ పేరుతో ఓ నవల కూడా రాశారు. ఆయనకు తులసి రాణి, సరోజ అనే ఇద్దరు కుమార్తెలు, శ్రీనివాస్ రాయ్ అనే కుమారుడు ఉన్నారు.

More Telugu News