Bandi Sanjay: కవితపై అనుచిత వ్యాఖ్యల కేసు.. బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసుల నోటీసులు!

  • సంజయ్ పై ఇటీవల ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్
  • సోమవారం విచారణకు రావాలని నోటీసులిచ్చిన పోలీసులు
  • తెలంగాణలో చాలా పోలీస్ స్టేషన్లలో సంజయ్ పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు!
panjagutta police issued a notice to bandi sanjay following his comments on kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు.

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

పంజాగుట్ట మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇవ్వగా.. శనివారం కమిషన్ ముందు హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా సంజయ్ సమాధానమిచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తెలంగాణ సామెతలను ఉపయోగించానని చెప్పారు. దీంతో ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మహిళా కమిషన్ చెప్పినట్లు సమాచారం.

More Telugu News