army: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి మృతి

  • నిన్న అరుణాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన హెలికాప్టర్ చీతా
  • వీవీబీ రెడ్డితో పాటు మేజర్ జయంత్ కూడా కన్నుమూత
  • నేడు హైదరాబాద్ కు వీవీబీ రెడ్డి మృతదేహం 
2 Pilots Killed in Indian Army Helicopter Crash in Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత వైమానిక దళం హెలికాప్టర్ చీతా కూలిపోయిన ఘటనలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి వీవీబీ రెడ్డి (ఉప్పల వినయ భానురెడ్డి) సహా ఇద్దరు పైలట్లు మృతిచెందారు. సెంగె నుంచి మిస్సమరి మార్గంలో ఈ హెలికాప్టర్ గురువారం బొమ్డిల పట్టణానికి పశ్చిమాన మండాల అనే ప్రాంతంలో కూలింది. నిన్న ఉదయం 9.15 గంటలకు ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలను కోల్పోయింది. అధికారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న  హైదరాబాద్‌ మల్కాజిగిరికి చెందిన ఆర్మీ లెప్టినెంట్‌ కల్నల్‌ ఉప్పల వినయ భానురెడ్డి (37) దుర్మరణం చెందారు. మరో మేజర్‌ జయంత్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. 

వినయ భానురెడ్డికి భార్య స్పందనారెడ్డి, కుమార్తెలు అనికరెడ్డి(6), హర్వికరెడ్డి(4) ఉన్నారు. స్పందనారెడ్డి కూడా పూణెలో ఆర్మీలో దంత వైద్యురాలుగా పనిచేస్తున్నారు. వారి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం. భానురెడ్డి తండ్రి నర్సింహ్మారెడ్డి గత 40 సంవత్సరాల నుంచి మల్కాజిగిరిలోని దుర్గానగర్‌లో నివాసముంటున్నారు. 2007లో ఆర్మీలో ఉద్యోగం సాధించిన వీవీబీ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి లెప్టినెంట్‌ కల్నల్‌ స్థాయికి చేరారు. ప్రస్తుతం ఆయన పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్‌లో శుక్రవారం వీవీబీరెడ్డి మృతదేహం నగరానికి రానుంది.

More Telugu News