Rajasthan: అది పొట్టా?.. బ్లేడ్‌ల కొట్టా?.. యువకుడి కడుపులో 56 బ్లేడ్ ముక్కలు!

  • రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఘటన
  • రక్తపు వాంతులు కావడంతో ఆసుపత్రికి
  • కడుపులోని బ్లేడ్లు చూసి నిర్ఘాంతపోయిన వైద్యులు
  • ఆపరేషన్ చేసి వెలికి తీసిన వైనం
Rajasthan man swallows 56 blades

 రక్తపు వాంతులు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన యువకుడికి స్కాన్ చేసిన వైద్యులు లోపల కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. విషయం తెలిసి అతడి స్నేహితులకు మూర్ఛపోయినంత పనైంది. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

యశ్‌పాల్ సింగ్(26) అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి బాలాజీ నగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం మిత్రులందరూ విధులకు వెళ్లిపోవడంతో యశ్‌పాల్ ఒక్కడే గదిలో మిగిలాడు. 

ఆ తర్వాత గంట సేపటికే యశ్‌పాల్‌కు రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో భయపడిపోయి మిత్రులకు ఫోన్ చేశాడు. వెంటనే వారొచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడతడికి పరీక్షలు చేసి స్కానింగ్ చేసిన వైద్యులు పొట్టలో కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంత పోయారు. 

అతడి కడుపులో ఏకంగా 56 బ్లేడు ముక్కలు గుర్తించారు. దీంతో వెంటనే యశ్‌పాల్‌కు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బ్లేడుపై ఉన్న కవర్‌తోనే బాధితుడు బ్లేడ్లను మింగేయడంతో అతడికి నొప్పి కలగలేదని పేర్కొన్నారు.

అవి పొట్టలోకి చేరాక పేపర్ జీర్ణం కావడంతో ఆ తర్వాత బ్లేడ్లు ప్రతాపం చూపించడం మొదలుపెట్టాయన్నారు. బ్లేడ్లను తినడానికి ముందే వాటిని అతడు ముక్కలు చేసినట్టు చెప్పారు. కాగా, యువకుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అతడి ప్రవర్తన సరిగానే ఉందని, బ్లేడ్లను మింగడం వెనకున్న కారణం తెలియదని అన్నారు.

  • Loading...

More Telugu News