Sharmila: ఢిల్లీలో ‘చలో పార్లమెంట్’కు యత్నం.. షర్మిల అరెస్టు!

  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరపాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద షర్మిల ధర్నా
  • తర్వాత పార్లమెంట్ కు ర్యాలీగా వెళ్లే యత్నం
  • అనుమతి లేదంటూ అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ysrtp president sharmila arrested by the police in delhi

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ‘చలో పార్లమెంట్’ ర్యాలీకి అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద షర్మిల ఈ రోజు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. తర్వాత జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేసుకుంటూ మందుకు సాగారు.

దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయని, ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పారు. అయినా షర్మిల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో.. ఆమెతో పాటు వైఎస్సార్‌టీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను తరలించారు. ఈ సమయంలో కొద్దిసేపు తోపులాట జరిగింది.

కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగడం కోసమే తాము నిరసన కార్యక్రమం చేపట్టామని షర్మిల చెప్పారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారని ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును మూడింతలు పెంచారని విమర్శించారు.

More Telugu News