KTR: మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందని చెబుతారేమో?: కేటీఆర్ సెటైర్లు

  • గతంలొ ఆర్ఆర్ఆర్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన బండి సంజయ్ 
  • అందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్
  • దానిపై బండి సంజయ్ ని విమర్శిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్
minister ktr satirical tweet on bandi sanjay about naatu naatu song

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌ ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ శుభాకాంక్ష‌లు తెలిపారు. నాటు నాటు పాటను రాసిన చంద్ర‌బోస్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ఆర్ఆర్ఆర్ మూవీపై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కొణ‌తం దిలీప్ గుర్తు చేశారు. 

‘‘బండి సంజయ్ లాంటి మతోన్మాదులు ఈ సినిమాపై ఎలాంటి విషం చిమ్మారో గుర్తు చేసుకోడానికి ఇది సరైన సమయం. ఆర్ఆర్ఆర్ చిత్రంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ద్వేషపూరిత వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచుదాం’’ అని కొణ‌తం దిలీప్ పేర్కొన్నారు. బండి సంజయ్ స్పీచ్ కు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘నాటు నాటు పాట‌కు మోదీ వ‌ల్లే అవార్డు వ‌చ్చిందని ఇలాంటి మ‌తోన్మాద వ్య‌క్తులు చెప్పుకుంటారేమో’’ అంటూ ట్వీట్ చేశారు. పగలబడి నవ్వుతున్న ఎమోజీ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

More Telugu News