The Elephant Whisperers: ఆస్కార్ వచ్చినప్పటి నుంచి వణికిపోతూనే ఉన్నా: ది ఎలిఫెంట్ విస్పరర్స్ సహ నిర్మాత మోంగా

  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో విస్పరర్స్ కు అవార్డు
  • వేడుకల్లో అవార్డు అందుకున్న గునీత్ మోంగా
  • ఇద్దరు మహిళలు ఈ చారిత్రక ఘనత సాధించారని వ్యాఖ్య
Guneet Monga says I am still shivering as The Elephant Whisperers wins Oscar

ఆస్కార్ 2023 భారతీయ సినిమా పరిశ్రమకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించగా.. అంతకుముందే ఎవ్వరూ ఊహించని ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే షార్ట్ ఫిల్మ్ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డును గెలిచి బోణీ చేసింది. ఈ డాక్యుమెంటరీ సహ నిర్మాత గునీత్ మోంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఇప్పటికీ ఆనందంతో వణికిపోతూనే ఉన్నానని చెప్పారు. 

‘మేము భారత చిత్ర పరిశ్రమ నుంచి మొట్టమొదటి ఆస్కార్‌ను గెలుచుకున్నాము. ఇద్దరు మహిళలు (తను, దర్శకురాలు కార్తికి) ఈ ఘనత సాధించారు. నేను ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో వణుకుతూనే ఉన్నాను. భారత ప్రొడక్షన్ హౌజ్ కు వచ్చిన తొలి ఆస్కార్ ఇది. ఇదెంతో చారిత్రక క్షణం. భారతదేశానికి చెందిన ఇద్దరు మహిళలుగా మేం ఈ ప్రపంచ వేదికపై నిలబడి ఈ చారిత్రాత్మక విజయం సాధించాము. ఈ చిత్రం గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఆస్కార్‌ను గెలుచుకున్న భారతీయ ప్రొడక్షన్ హౌజ్ గా సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ చరిత్ర సృష్టించింది. ఈ క్షణంలో ఆనందం, ప్రేమ, ఉత్సాహంతో నా గుండె పరుగెత్తుతోంది. కార్తికి (డైరెక్టర్)కి థ్యాంక్స్. ఆమెకు అద్భుతమైన దూరదృష్టి ఉంది. ఇక, నెట్‌ఫ్లిక్స్ మాకు ప్రపంచంలోనే అతిపెద్ద వేదికను అందించింది. మాపై నమ్మకం ఉంచి మద్దతు ఇచ్చింది. భారతీయ సినిమా భవిష్యత్తు సాహసోపేతమైనదని, భవిష్యత్తు ఇక్కడే ఉందని ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా. ఈ భవిష్యత్తు మహిళదే అని మరిచిపోకూడదు’ అని ఆమె పేర్కొన్నారు.

More Telugu News