Pawan Kalyan: అందరూ నన్ను కాపు, కాపు అంటారు... కానీ కాపులు నన్ను కాపుగా గుర్తించడంలేదు: పవన్ కల్యాణ్

  • పవన్ కల్యాణ్ తో కాపు సంక్షేమ సేన భేటీ
  • కాపులు తన వెంట నిలబడడంలేదన్న పవన్
  • ఎన్నికల్లో కాపులు ఓటెయ్యకపోతే జనసేన ఎలా గెలుస్తుందని అసంతృప్తి
  • కాపులు అండగా నిలిస్తే జనసేనదే విజయం అని ఉద్ఘాటన
Pawan Kalyan held meeting with Kapu leaders

ఇవాళ మంగళగిరి జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ కాపు సంక్షేమ సేన భేటీలో పాల్గొన్నారు. కాపు నేతలతో తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... అందరూ తనను కాపు, కాపు అంటారని... కానీ కాపులే తనను కాపుగా గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులు తన వెంట నిలబడడంలేదని విచారం వ్యక్తం చేశారు. కాపులు తన వెన్నంటి నిలిస్తే తప్పకుండా అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

"నా సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్నాను. నేను ఏనాడూ విరాళాలు ఇవ్వండి అని అడగలేదు. కొందరు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. తద్వారా అండగా నిలుస్తున్నారు. నిన్న బీసీ వర్గాల వారు సూచించిన అంశాలు నేడు కాపు సంక్షేమ సేన వారి ముందు ఉంచుతాను. వాటిపై కాపు నేతలు  ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను పదేళ్లుగా పోరాడుతున్నాను. మీరు కూడా నాతో కలిసి నిలబడండి... మరో పదేళ్లలో మీరే నాయకులు అవుతారు. 

కాపుల ఒక్కరి వల్లే అధికారం వస్తుందని చెప్పడంలేదు... కానీ కాపులు ఐక్యంగా నిలబడి ఇతర వర్గాలను కూడా కలుపుకుని పోతే కచ్చితంగా అధికారం సాధించగలం. నాయకులు మీలోంచే అవతరిస్తారు. కాపులు కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం కారు... తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉన్నారు. కాపులు అందరూ కలిసి ఉంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సమాజంగా కాపు సమాజం ఉద్భవిస్తుంది. నాయకుడు బతికి ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడాలి. ఆ నాయకుడి వెంట నడవాలి... అప్పుడే బాగుపడతాం. ఈ విషయాన్ని కాపు సమాజం గ్రహించాలి" అని పిలుపునిచ్చారు. 

అంతేకాదు, వంగవీటి రంగా అంశాన్ని కూడా పవన్ కల్యాణ్ ఈ భేటీలో ప్రస్తావించారు. చనిపోయిన తర్వాత రంగా పేరు జిల్లాకు పెట్టడం కాదు.... రంగా బతికి ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొన్నారు. నాడు ఆయన నిరాహార దీక్షకు కాపులు రక్షణగా నిలబడి ఉంటే ఆయన హత్య జరిగి ఉండేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. 

కాపులు అధికారంలోకి వస్తే మిగతా కులాలను తొక్కేస్తారని విషప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదని పేర్కొన్నారు. కాపుల సంక్షేమం, కాపుల మెరుగైన భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కరూ తాను చెప్పిన మాటలు విని, తప్పులు సరిచేసుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఐక్యంగా నిలబడండి, రాజ్యాధికారం సాధించండి అని పిలుపునిచ్చారు. 

"కాపులకు మేం అండగా నిలబడం అని గోదావరి జిల్లాలో ఛీ కొట్టిన వ్యక్తి చుట్టూ ర్యాలీలు చేసి, ఆయనకు ఓటేసినప్పుడు ఆత్మగౌరవం ఏమైంది? నా ఆత్మగౌరవం అని ఇప్పుడు మాట్లాడడం కాదు, మీ అందరి ఆత్మగౌరవం కోసం కలిసి నిలబడండి. ఇక్కడికి వచ్చి మా కులం, మా కులం అంటారు కానీ... ఎన్నికల్లో జనసేనకు ఓటెయ్యకపోతే ఎలా గెలుస్తుంది? ఈసారి ఓటును డబ్బులకు అమ్ముకోకుండా, జనసేనకు ఓటెయ్యండి. 

మీరందరూ పెద్దన్న పాత్ర వహిస్తే అధికారాన్ని ఎవరూ కూడా మీకు దూరం చేయలేరు. మన కులం కాని వారిని కూడా అక్కున చేర్చుకోగలిగాలి. ఎంత ప్రేమ లేకపోతే సమాజం మీద నేను ఇంతలా పోరాడుతున్నానో గమనించాలి. 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును నేను గౌరవించాను. కానీ వెనుదిరిగి వెళ్లిపోలేదు. గత పదేళ్లుగా మాటలు పడుతూనే ఉన్నాను. అయినా ప్రయత్నం ఆపలేదు. 

రూ.1000 కోట్ల ప్యాకేజీ అంటుంటారు... కేవలం డబ్బుతోనే పార్టీలు నడపలేం. వేదన ఉంది కాబట్టే పార్టీ నడుపుతున్నాం, ప్రజల కోసం పార్టీ నడుపుతున్నాను" అని స్పష్టం చేశారు. 

ఇక, వచ్చే ఎన్నికల్లో పొత్తులపైనా పవన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో 20 సీట్లకు పొత్తు కుదిరిందంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని వెల్లడించారు. తాను లోపాయికారీ ఒప్పందాలు ఎప్పుడూ చేసుకోనని స్పష్టం చేశారు. మన గౌరవాన్ని తగ్గించే పొత్తులకు ఎప్పుడూ అంగీకరించనని, ఏ ఒక్క జనసైనికుడి ఆత్మగౌరవాన్ని తగ్గించే పని చేయనని తెలిపారు. 

సీఎం జగన్ ది ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం అని పవన్ కల్యాణ్ విమర్శించారు. మీ కులంలో ఎలాంటి వ్యక్తినయినా తిట్టండి... నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడండి అనే రకం అని వివరించారు. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రాజ్యాధికారం చేతకాదు అని మాట్లాడేవారి చెంప పగిలేలా ఎన్నికల ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

అయితే, తాను పుట్టడం కాపు కులంలో పుట్టినా, తన మనసు మాత్రం అధికారానికి దూరంగా ఉన్న రెల్లి వంటి కులాల మధ్య ఉంటుందని, వారికి కూడా రాజ్యాధికారం కల్పించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

More Telugu News