OYO Founder: 20వ అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఓయో రూమ్స్ సీఈవో తండ్రి

  • గురువారం హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • ఈ నెల 7న ఓయో సీఈవో రితేష్  పెళ్లి
  • మూడు రోజులకే తండ్రి రమేష్ ను కోల్పోయిన రితేష్
OYO Founder Father Dies Days After Son Wedding Falls From 20th Floor

ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రితేష్ పెళ్లి జరిగిన మూడు రోజులకే ఆయన తండ్రి రమేష్ అగర్వాల్ గురువారం మృతి చెందారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనంపై నుంచి పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లో డీఎల్ఎఫ్ సంస్థకు చెందిన ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి కింద పడినట్లు సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స కోసం పరాస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు.  

తన పెళ్లి వేడుక జరిగిన రోజుల వ్యవధిలో తండ్రిని కోల్పోవడంతో రితేష్ అగర్వాల్ తీవ్రమైన మనో వేదనకు గురయ్యారు. ‘నాకు, మా కుటుంబానికి మార్గదర్శకుడైన మా నాన్న రమేష్ అగర్వాల్ మార్చి 10 న మరణించారని బరువైన హృదయంతో చెబుతున్నా. ఆయన పూర్తి జీవితాన్ని గడిపారు. నాకు స్ఫూర్తినిచ్చారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు’ అని రితేష్ ట్వీట్ చేశారు. ఈ నెల 7న గీతాన్షా సూద్‌తో రితేష్ వివాహం జరిగింది.

More Telugu News