Sharmila: కేసీఆర్ పాపాలపుట్ట పగులుతోంది: షర్మిల

  • కాళేశ్వరంపై కాగ్ పరిశీలన చేపట్టనుందని పత్రికా కథనం
  • తమ పోరాటానికి ఫలితం దక్కుతోందన్న షర్మిల
  • కేసీఆర్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడి
Sharmila fires on CM KCR

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ మరింత లోతైన పరిశీలన చేపట్టనుందని పత్రికల్లో వచ్చిన కథనంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. కేసీఆర్... నీ పాపాలపుట్ట పగులుతోందని వ్యాఖ్యానించారు. నీ నేరాల చిట్టా నాగు పామై కాటేసే రోజు దగ్గరలో ఉందని పేర్కొన్నారు. 

"కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అవినీతిపై ఢిల్లీలో కాగ్ ని కలిసి ఆధారాలతో సహా అందించిన ఫిర్యాదుకు, మా అవిశ్రాంత పోరాటానికి ఫలితం దక్కుతోంది. ఇక మీ సర్కారు పతనమే మిగిలుంది. ఖబడ్దార్ 420 కేసీఆర్... నీకు కూడా జైలు ఖాయం" అని షర్మిల ట్వీట్ చేశారు. 

అటు, మరో ట్వీట్ లోనూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుంది చిన్నదొర ప్రెస్ మీట్ అని విమర్శించారు. ఏ తప్పు చేయకపోతే భయపడడమెందుకు? అని ప్రశ్నించారు. 

"కేంద్రం చేతిలో ఈడీ తోలుబొమ్మ అయితే, మీ సర్కారు చేతిలో పోలీసు శాఖ కీలుబొమ్మ కాదా? వాస్తవాలు వెల్లడించే మీడియాపై చిన్నదొరకు ఎందుకంత అసహనం? సొంత మీడియాను జనం నమ్మడంలేదనా? నీ చెల్లి నిర్దోషి అయితే... మొత్తం లిక్కర్ దందాలో ఏం జరిగిందో చెప్పు!" అని షర్మిల నిలదీశారు.

More Telugu News