Manish Sisodia: వృద్ధుల సెల్ లో సిసోడియా.. అదే వార్డులో భయంకరమైన క్రిమినల్స్!

  • లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా
  • కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో తీహార్ జైలుకు తరలింపు
  • మార్చి 20 దాకా అక్కడే సిసోడియా
  • తొలిరోజు రాత్రి భోజనంలో చపాతి, అన్నం, ఆలూ కర్రీ పెట్టినట్లు తెలిపిన అధికారులు
Manish Sisodias Day 1 In Jail Senior Citizens Cell Dreaded Criminals As Neighbours

లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన్ను మార్చి 20 దాకా జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. 

సిసోడియాను సీనియర్ సిటిజెన్ల సెల్ లో ఉంచినట్లు జైలు అధికారులు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అందులో ఆయన ఒక్కరినే ఉంచామని, సీసీటీవీలతో నిఘా ఉంచామని చెప్పారు. ‘‘మనీశ్ సిసోడియాను 9వ వార్డులోని సెల్ లో ఉంచాం. ఆయన ఉన్న సెల్ లో త్వరలోనే మరొకరిని ఉంచే అవకాశం ఉంది. సిసోడియా ఉన్న వార్డులోనే కొందరు భయంకరమైన నేరస్థులు కూడా ఉన్నారు’’ అని వెల్లడించారు.

‘‘కోర్టు ఉత్తర్వుల తర్వాత సోమవారం మధ్యాహ్నం తీహార్ జైలుకు సిసోడియాను తరలించారు. అక్కడ కొన్ని ఆరోగ్య పరీక్షలు చేశారు. రిపోర్టులన్నీ నార్మల్ గానే ఉన్నాయి’’ అని అధికారులు తెలిపారు. టూత్ పేస్ట్, బ్రష్, సోప్ తదితరాలతో కూడిన కిట్ ను ఆయనకు ఇచ్చినట్లు వివరించారు. రాత్రి భోజనంలో చపాతి, అన్నం, ఆలూకర్రీ పెట్టినట్లు తెలిపారు. జైలులోకి మెడిసిన్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అద్దాలు, డైరీ, పెన్ను, భగవద్గీత పెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.

More Telugu News