Babar Azam: వరల్డ్ కప్ కోసం భారత్ వస్తున్న పాకిస్థాన్... ఇన్ డైరెక్టుగా చెప్పేసిన బాబర్ అజామ్

  • అక్టోబరు, నవంబరు నెలల్లో భారత్ లో వన్డే వరల్డ్ కప్
  • భారత్, పాక్ మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు
  • ఆసియాకప్ లో ఆడేందుకు పాక్ వెళ్లబోమన్న భారత్
  • తాము కూడా భారత్ లో అడుగుపెట్టబోమన్న పాక్
  • తాజాగా ఆసక్తి రేకెత్తిస్తున్న బాబర్ వ్యాఖ్యలు
Babar says indirectly Pakistan prepares for world cup in India

దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య రాజకీయ సంబంధాల పుణ్యమా అని క్రికెట్ సంబంధాలు దెబ్బతినడం తెలిసిందే. ఇరుదేశాలు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడి చాన్నాళ్లయింది. భారత్, పాకిస్థాన్ జట్లు ప్రస్తుతం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. 

అయితే ఆసియాకప్ కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా, టీమిండియా పాకిస్థాన్ లో అడుగుపెట్టబోదని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించగా, తమ జట్టు కూడా వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ లో అడుగుపెట్టదని పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. వరల్డ్ కప్ కోసం తమ జట్టు భారత్ వెళుతుందని పరోక్షంగా చెప్పేశాడు. 

అక్టోబరు, నవంబరు నెలల్లో భారత్ లో ప్రపంచకప్ జరగనుంది. తాము భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ పై దృష్టి సారించామని బాబర్ వెల్లడించాడు. ఆ మెగా టోర్నీలో రాణించేందుకు శ్రమిస్తున్నామని తెలిపాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తానని, టాపార్డర్ లో తామిద్దరిది మంచి కాంబినేషన్ అని వివరించాడు. 

అయితే, కేవలం ఒకరిద్దరు రాణిస్తేనే సరిపోదని బాబర్ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో గెలుపుకాంక్షతో ఉరకలు వేసే అనేకమంది ఉత్సాహవంతులైన ఆటగాళ్లు ఉన్నారని ధీమాగా చెప్పాడు.

More Telugu News