Earthquake: ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల వ్యవధిలో రెండో భూకంపం

  • ఉత్తర కాశీలో 2.5 తీవ్రతతో కంపించిన భూమి
  • గురువారం పౌరి గర్వాల్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూకంపం
  • గతేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో కంపించిన భూమి
earthquake shakes Uttarakhands Uttarkashi

ఇటీవల తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. టర్కీ, సిరియాల్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. వేలాదిమంది ప్రాణాలను బలిగొంది. ఆ తర్వాత కూడా పలుమార్లు భూకంపాలు  సంభవించాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. ఉత్తర కాశీలో గత అర్ధరాత్రి దాటిన తర్వాత 12.45 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై  2.5గా నమోదైంది. 

ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్ జిల్లాలో గురువారం 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు గతేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇప్పుడు మరోమారు భూకంపం ప్రజలను  భయపెట్టింది.

More Telugu News