Manish Sisodia: సీబీఐ కస్టడీలో మానసికంగా వేధిస్తున్నారు: కోర్టుకు తెలిపిన సిసోడియా

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన మనీశ్ సిసోడియా
  • నేటితో ముగిసిన సీబీఐ కస్టడీ
  • కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు
  • రోజుకు 10 గంటల పాటు ప్రశ్నిస్తున్నారన్న సిసోడియా
Sisodia alleged CBI harasses him during custody

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాకు విధించిన కస్టడీ నేటితో ముగిసింది. దాంతో ఆయనను సీబీఐ అధికారులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులపై సిసోడియా ఆరోపణలు చేశారు. 

కస్టడీలో తనను మానసికంగా వేధించారని కోర్టుకు తెలిపారు. రోజూ తనను 10 గంటల పాటు ఏకధాటిగా ప్రశ్నిస్తున్నారని, ఇది థర్డ్ డిగ్రీ చిత్రహింసలతో సమానం అని వివరించారు.  

అందుకు కోర్టు స్పందిస్తూ.... అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగొద్దని సీబీఐ అధికారులకు స్పష్టం చేసింది. అంతేకాదు, క్రమం తప్పకుండా సిసోడియాకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండాలని ఆదేశించింది. 

కాగా, సీబీఐ తన వాదనలు వినిపిస్తూ... లిక్కర్ స్కాంలో ఇతర నిందితులతో కలిపి సిసోడియాను విచారించాల్సి ఉందని, ఆ నిందితుల పేర్లు కోర్టులో చెప్పలేమని విన్నవించింది. సిసోడియాను మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. సిసోడియాను ఇప్పటివరకు ప్రశ్నించిన వివరాలతో కూడిన ఓ సీడీని కూడా కోర్టుకు సమర్పించింది.

వాదనలు విన్న న్యాయస్థానం... సిసోడియాకు సోమవారం వరకు సీబీఐ కస్టడీ విధిస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News