Prime Minister: గతేడాది వారణాసిని 7 కోట్ల మంది సందర్శించారు: ప్రధాని

  • 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలన్న ప్రధాని 
  • భారత్ ను సందర్శించేవారి ఎంపికలో వీటికి చోటుండాలన్న అభిప్రాయం
  • డెస్టినేషన్ వెడ్డింగ్ కు పెరుగుతున్న ఆసక్తిపై దృష్టి పెట్టాలని సూచన
Develop 50 destinations in India that will appear on every tourists list PM Modi

సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశ పర్యాటక రంగాన్ని నవీకరించేందుకు దీర్ఘకాల ప్రణాళిక అవసరమన్నారు. బడ్జెట్ తర్వాత ప్రధాని వివిధ శాఖలకు సంబంధించి చేసిన కేటాయింపులు, తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వెబినార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పర్యాటక రంగంపై నిర్వహించిన వెబినార్ లో మాట్లాడారు. 

పౌర సదుపాయాలు మెరుగుపడితే, మంచి డిజిటల్ కనెక్టివిటీ, హోటళ్లు, హాస్పిటల్స్ ఉంటే భారత పర్యాటక రంగం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ్ మందిరాన్ని ప్రస్తావించారు. మతపరమైన ప్రదేశాన్ని నవీకరించడంతో పర్యాటకుల రాక పెరిగిందని, గతేడాది ఏడు కోట్ల మంది సందర్శించారని చెప్పారు. 

‘‘మనం కనీసం 50 పర్యాటక ప్రాంతాలను అయినా అభివృద్ధి చేసుకోవాలి. భారత్ ను సందర్శించాలనుకున్నప్పుడు వారి జాబితాలో ఇవి కనిపించాలి’’ అని ప్రధాని పేర్కొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కు పెరుగుతున్న ఆసక్తిని పర్యాటక పరిశ్రమ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అటువంటి వాటికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించొచ్చని సూచించారు. దాంతో భిన్న రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. భారీ ఉపాధి కల్పన సామర్థ్యాలు పర్యాటక రంగానికి ఉన్నాయన్నారు.

More Telugu News