Allu Arjun: ఆదిపురుష్ నిర్మాత, అర్జున్ రెడ్డి దర్శకుడితో అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం

  • పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బన్నీ 23వ చిత్రం
  • నిర్మాతగా భూషణ్ కుమార్
Allu Arjun to do pan india movie with Director Sandeep Reddy Vanga

పుష్ప సినిమాతో బాలీవుడ్ ను ఊపేసిన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తన తొలి చిత్రం అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇదే చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం రాబోతోంది. ప్రభాస్ తో ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మిస్తున్న టీ సిరీస్ అధినేత భూషణ్‌ కుమార్‌ దీనికి నిర్మాత. ఈ ముగ్గురి కాంబినేషన్ వస్తున్న సినిమా గురించి చిత్ర యూనిట్ ఈ రోజు ప్రకటన చేసింది. 

బన్నీ, సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్, ఇతర సహ నిర్మాతలు కలిసున్న ఫొటోను టీ సిరీస్ ట్విట్టర్ లో షేర్ చేసింది. టీ సిరీస్‌, సందీప్‌ హోం బ్యానర్‌ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం బన్నీ పుష్ప2లో నటిస్తున్నారు. మరోవైపు రణ్ బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్ రెడ్డి ‘యానిమల్‌’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ 2025లో సెట్స్‌ పైకి వెళ్లనుంది. అల్లు అర్జున్ కి ఇది 23వ చిత్రం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News