Chittoor District: కుప్పంలో విషాదం: అర్ధరాత్రి వరకు జన్మదిన వేడుకలు.. నిద్ర పట్టక కారులో బయటకెళ్లి ముగ్గురి దుర్మరణం

  • ఎంబీబీఎస్ విద్యార్థి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన పెద్దమ్మ కుమారుడు, స్నేహితులు
  • అర్ధరాత్రి తర్వాత నిద్ర పట్టడం లేదంటూ కారులో బయటకెళ్లిన ముగ్గురు విద్యార్థులు
  • లారీని ఢీకొట్టి తుక్కుగా మారిన కారు
Car Accident in Kuppam Three Died

చిత్తూరు జిల్లా కుప్పంలో పెను విషాదం చోటు చేసుకుంది. నిద్ర పట్టడం లేదని అర్ధరాత్రి కారులో షికారుకెళ్లిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. చిన్నశెట్టిపల్లె‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి పుట్టిన రోజు వేడుకలకు అతడి పెద్దమ్మ కుమారుడైన మిట్స్ కళాశాల విద్యార్థి వెంకటసాయి కల్యాణ్, పీఈఎస్‌లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవికాస్‌రెడ్డి, తృతీయ సంవత్సరం చదువుతున్న తలారి ప్రవీణ్, ఇతర స్నేహితులు హాజరయ్యారు.

శనివారం అర్ధరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కొందరు విద్యార్థులు గదిలో నిద్రపోయారు. శ్రీవికాస్‌రెడ్డికి ఎంతకీ నిద్రపట్టకపోవడంతో అలా తిరిగి వద్దామంటూ ప్రవీణ్‌, వెంకటసాయితో కలిసి కుప్పంకు చెందిన మరో విద్యార్థి కారులో తెల్లవారుజామున బయల్దేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వారి కారు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. 

ప్రమాదం ఎంత భయంకరంగా జరిగిందంటే.. ప్రమాదం తర్వాత కారు ఆనవాలు లేకుండా తుక్కుతుక్కుగా మారింది. ఈ ఘటనలో వారు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News