Stray Dogs: వీధి కుక్కలను పట్టుకునేందుకు నేపాల్ నుంచి ప్రత్యేక బృందాలు!

  • ఇటీవల హైదరాబాదులో ఘోరం
  • ఐదేళ్ల బాలుడ్ని చంపేసిన వీధికుక్కలు
  • మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
  • కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
Nepal expert teams to catch stray dogs in Telangana

హైదరాబాదులో ఇటీవల ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేయడం దిగ్భ్రాంతి కలిగించింది. దాంతో వీధి కుక్కల అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సత్వరమే స్పందించింది. నగర వీధుల్లో కుక్కల జనాభాను కట్టడి చేసేందుకు అన్ని మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో, నిజామాబాద్ మున్సిపాలిటీ కూడా ఈ దిశగా కార్యాచరణకు నడుం బిగించింది. వీధి కుక్కలను పట్టుకునేందుకు నేపాల్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. కుక్కలను పట్టుకోవడంలో నిపుణులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు తక్కువ సమయంలో ఎక్కువ కుక్కలను బంధించగలరు. 

అదే సమయంలో, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కుక్కలను చంపకుండా, వాటికి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేపడతారని, కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇస్తారని తెలుస్తోంది. నిజామాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి శునక నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.

More Telugu News