Nara Lokesh: అహ్మదాబాద్ ప్రొఫెసర్ వ్యాఖ్యాతగా లోకేశ్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం... వివరాలు ఇవిగో!

  • తిరుపతిలో యువగళం
  • వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్
  • అంకుర ఆసుపత్రి సమీపంలో హలో లోకేశ్ కార్యక్రమం
  • యువతీయువకులతో లోకేశ్ ముఖాముఖి
Lokesh talks to youth in Tirupati

రాష్ట్రంలో లక్షలాదిమంది యువత భవిష్యత్తు కోసమే తాను యువగళం పాదయాత్ర చేపట్టానని, అరాచకపాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి నెం.1గా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తిరుపతి అంకుర హాస్పటల్ సమీపాన ప్రాంగణంలో హాలో లోకేశ్ పేరుతో యువతీయువకులతో ఉత్సాహంగా సాగిన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. యువతీయువకులు అడిగిన ప్రతిప్రశ్నకు లోకేశ్ సూటిగా సమాధానాలిచ్చారు. అహ్మదాబాద్ కు చెందిన ప్రొఫెసర్ రాజేశ్ వ్యాఖ్యాతగా ఆసక్తికరంగా సాగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లోకేశ్ నిర్మొహమాటంగా తన మనోభావాలను వ్యక్తపర్చారు.

ప్రశ్న: మీరు చాలా విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు వదులుకుని కష్టపడుతున్నారు? యువగళం ఎందుకు ప్రారంభించారు?

లోకేశ్: రాష్ట్రం జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో మగ్గిపోతోంది. యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. రాష్ట్రం అన్ని రంగాల్లో అట్టడుగు స్థాయికి వెళ్లిపోయింది. రాష్ట్రాన్ని మళ్లీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఈ యువగళం ప్రారంభించాను. 

ప్రశ్న: మీరు బాగా ఉన్నత కుటుంబం నుండి వచ్చారు. బడుగు,బలహీనవర్గాల గురించి అవగాహన లేదని కొంత మంది విమర్శిస్తున్నారు. దానికి మీరేం చెబుతారు?

లోకేశ్: మా తాత ఏపీ కి పూర్వపు సీఎం, మా నాన్న ఏపీకి సుదీర్ఘకాలం సీఎం. సమాజంలో మార్పును ఏమైతే మనం ఆశిస్తున్నామో దాన్ని ఒక యువకుడిగా తీసుకురావాలని నేను సంకల్పించాను. నన్ను వైసీపీ వాళ్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నేను పట్టించుకోలేదు. నా లక్ష్యం రాష్ట్రాభివృద్ధి మాత్రమే. మా కుటుంబం భోజన సమయంలో కూడా రాష్ట్ర సమస్యలపై చర్చిస్తాం. పరదాల చాటున దాక్కున్న సీఎం కంటే ఎక్కువ అవగాహన నాకు ఉంది.

ప్రశ్న: యువతకు మీరు ఏం చేశారని మీ వైపుకు వస్తారు?

లోకేశ్: చిత్తూరు జిల్లా యువతకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జోహో, సెలకాన్, ఫాక్స్కాన్, టీసీఎల్ తెచ్చాం. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కూడా అందించాం. నేను తెచ్చిన కంపెనీల వద్ద సెల్ఫీ తీసుకుని జగన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరాను. దాన్ని స్వీకరించే పరిస్థితి లేకుండా పోయింది. యువతను పార్టీలో పెద్దఎత్తున ప్రోత్సహించింది టీడీపీ. అందుకే నాకు 100శాతం యువతతో కలిసి నడవడానికి, వాళ్లు నాతో రావడానికి అవకాశం ఉంది.

ప్రశ్న: ఇప్పటి వరకు పూర్తయిన 350 కిలోమీటర్ల పాదయాత్రలో మీకు ఆనందం కలిగించిన అంశాలేంటి?

లోకేశ్: రాష్ట్ర ప్రజలు నిజమైన అభివృద్దిని కాదనుకుని మోసం చేసే ప్రభుత్వాన్ని ఎందుకు అధికారంలోకి తెచ్చుకున్నారోనని బాధపడుతూ ఉండేవాడిని. కానీ మన ప్రభుత్వంలో మనం తెచ్చిన కంపెనీలను చూస్తున్నప్పుడు, అందులో ఉద్యోగులు నాతో తమ సంతోషాన్ని పంచుకున్నప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. నా బాధ మొత్తాన్ని మరిచిపోయాను. నా ఉత్సాహం ఆ కంపెనీలను చూశాక రెట్టింపయ్యింది.

యువత అడిగిన ప్రశ్నలపై యువనేత సమాధానాలు

*రాము, శ్రీశైలం: జగన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఏం ఇస్తారు అన్నా?

లోకేశ్: ఏపీలోని యువత మొత్తానికి ఉద్యోగాలిచ్చి దాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. 2019లో యువతకు జగన్ హామీలిచ్చి తప్పిన వాటిని మేం నెరవేరుస్తాం. మాట తప్పి, మడమ తిప్పిన వారికి బుద్ధి వచ్చేలా చేస్తాం.

శశికుమార్: ఈ ప్రభుత్వం ఎందుకు మాకు సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదు? ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు తీసుకురాలేదు? చంద్రబాబు ఉండగా చాలా పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయి. మీరు అధికారంలోకి వచ్చాక మాకు ఎలా సహాయపడతారు?

లోకేశ్: ఏపీలో రెండు బ్రాండ్లు ఉన్నాయి. బాబు మరియు జగన్. బాబు అంటే అభివృద్ధికి బ్రాండ్... ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఉంటాయి. ఇక జగన్ బ్రాండ్ అంటే... పరిశ్రమలను పక్కరాష్ట్రాలకు తరిమేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడం, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేయడం.  

ప్రశ్న: మీరు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తారా?

లోకేశ్: విభజన మనం కోరుకున్నది కాదు. పార్లమెంటులో ఆనాడు మన ఎంపీలు పోరాడారు. ఆ పోరాటం వల్లే హోదా హామీ వచ్చింది. కానీ దీన్ని కేంద్రం నిలబెట్టుకోలేదు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ప్రత్యేకహోదా అంశం గురించి మాట్లాడడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళుతున్నాడు. ఎందుకు వెళ్లాడో ఎవరికీ చెప్పలేదు. టీడీపీకి ఉన్న నలుగురు ఎంపీలు మాత్రమే ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నారు.  

ప్రశ్న: మీ తాత అన్న నందమూరి తారకరామారావు ఓ పెద్ద లెజెండ్. మీ తండ్రి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. ఇప్పుడు మీపై ఏమైనా ఒత్తిడి ఉందా?

లోకేశ్: ఒత్తిడి కంటే బాధ్యత ఎక్కువ నాపై ఉంది. యువతకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. ఏపీని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయాలన్న ఆలోచన నాలో ఉంది. ఆ బాధ్యతే నాలో పెరిగింది.

ప్రశ్న: పింక్ డైమండ్ లొల్లి ఏంది అన్నా? అది మీ దగ్గరుందా? ఉంటే ఎప్పుడు ఇస్తారు?

లోకేశ్: ఈ పింక్ డైమండ్ లొల్లి నాకే అర్థం కావడం లేదు. చంద్రబాబు పాలనలో తిరుపతి వెంకన్న పింక్ డైమండ్ కొట్టేశామని విజయసాయిరెడ్డి అన్నారు. వెంకటేశ్వరస్వామి జోలికి వెళితే వాళ్ల పని గోవిందా... గోవిందా. అన్ని కొండలు ఎందుకు? అని మాట్లాడిన వారు ఏమయ్యారో మనం గతంలో చూశాం. పింక్ డైమండ్ గురించి విజయసాయిరెడ్డినే అడగాలి.

ప్రశ్న: మీరు గతంలో మంగళగిరిలో ఓడిపోయారు. నేడు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. మీ ప్రణాళిక ఏంటి?

లోకేశ్: మంగళగిరిలో టీడీపీ ఇప్పటికి రెండు సార్లే గెలిచింది. అటువంటి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చాలనేది నా దృఢ సంకల్పం. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. మంగళగిరిలో 2024లో టీడీపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుంది. మీరు రాసిపెట్టుకోండి.

ప్రశ్న: మహిళల సాధికారత కోసం మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు?

లోకేశ్: ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయి. దానికి కారణం అధికారంలో ఉన్న నాయకుల ప్రవర్తన. ఓ మహిళా మంత్రి నాకు చీరలు, గాజులు పెడతానని చెప్పింది. మహిళల్ని ఆమె అవమానించింది. నాకు చాలా బాధ వేసింది. ఆ చీర, గాజులు నాకు పంపు వాటిని నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పా. మహిళల్ని గౌరవించడం ఇంటి నుండే అలవాటు కావాలి. 


టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం 344.6  కి.మీ.

యువగళం పాదయాత్ర 27వ రోజు షెడ్యూల్(25-2-2023)
తిరుపతి నియోజకవర్గం
ఉదయం
11.00  – తిరుపతి అంకుర హాస్పటల్ సమీపానగల విడిది కేంద్రంలో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులతో భేటీ.
మధ్యాహ్నం 
12.00  – క్యాంప్ సైట్ లో భవన నిర్మాణకార్మికులతో సమావేశం.
1.00 -  క్యాంప్ సైట్ లో భోజన విరామం.
సాయంత్రం
4.00  – తిరుపతి అంకుర హాస్పటల్ సమీపాన విడిది కేంద్రంనుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – తిరుపతి 4వ డివిజన్ ఎస్సీ కాలనీలో పాదయాత్ర.
5.20 – తిరుపతి ఆర్టీసి బస్టాండు వద్ద పాదయాత్ర.
5.30 – తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్ర.
5.40 – గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకోనున్న పాదయాత్ర.
5.50 – తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద ఆటో కార్మికులతో సమావేశం.
6.30 – కృష్ణాపురం ఠాణా వద్ద స్థానికులతో మాటామంతీ.
6.45 – టౌన్ క్లబ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – బాలాజీ కాలనీలో స్థానికులతో భేటీ.
7.35 – ఎంఆర్ పల్లి సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.
8.00 – అన్నమయ్య సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
8.35 – టి.వి.ఎస్ షోరూమ్ సర్కిల్లో స్థానికులతో భేటీ.
9.55 – చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశం, తిరుచానూర్ సర్కిల్ విడిది కేంద్రంలో బస.

More Telugu News