Karnataka: మొన్న విమానంలో.. నేడు బస్సులో.. ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన యువకుడు!

  • కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఘటన
  • నిద్రలో ఉన్న మహాలపై మూత్రవిసర్జన 
  • బస్సు నుంచి దించేసిన వైనం
Drunk man pees on KSRTC bus female co passenger seat

ఎయిరిండియా విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఇటీవల తీవ్ర సంచలనమైంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్ణాటక ఆర్టీసీ బస్సులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులోని ఓ దాబా వద్ద ఆగింది.

ప్రయాణికులు టీ తాగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బస్సులోని 28వ నంబరు సీటులో కూర్చున్న మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్న రామప్ప అనే 25 ఏళ్ల యువకుడు బస్సు ముందువరుసలో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లి ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. నిద్రలో ఉన్న ఆమె ఈ అకస్మాత్తు పరిణామంతో ఒక్కసారిగా లేచి కేకలు పెట్టారు. దీంతో బస్సులోని మిగతా ప్రయాణికులు, బస్సు దిగి టీ తాగుతున్న వారు పరుగున ఆమె వద్దకు వచ్చారు. 

నిందితుడిని పట్టుకుని బయటకు తోసేశారు. అతడి సామగ్రిని విసిరేశారు. కొందరు ప్రయాణికులు అతడిపై చేయి కూడా చేసుకున్నారు. కాగా, బాధిత మహిళ దాబాలోని స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకుని వచ్చే వరకు బస్సును ఆపారు. నిందితుడైన యువకుడు మద్యం మత్తులో అలా చేశాడని భావిస్తున్నారు. మహిళ చెప్పడంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బస్సు కండక్టర్ తెలిపారు.

More Telugu News