Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • పెళ్లికి వెళ్లి ఆటోలో వస్తున్న వారిని ఢీకొట్టిన లారీ
  • మృతులందరూ మహిళలే
  • గాయపడిన ఐదుగురిలో మరో ఇద్దరి పరిస్థితి విషమం
Four Women Died In Road Accident in Parvathipuram Andhrapradesh

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బాధితులు ఓ పెళ్లి వేడుకకు వెళ్లి ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొమరాడ మండల పరిధిలోని కూనేరు-చోళ్లపదం ప్రధాన రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. పార్వతీపురం నుంచి రాయ్‌గఢ్ వెళ్తున్న లారీ-కూనేరు నుంచి కొమరాడ వస్తున్న ఆటో ఢీకొన్నాయి.

ఈ ఘటనలో అంటివలస గ్రామానికి చెందిన నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తుమ్మవలస గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లిన బాధితులు ఆటోలో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News